4న నీట్
ABN , Publish Date - May 02 , 2025 | 12:55 AM
వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్’ ఈనెల నాలుగో తేదీన నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది.
నగరంలో 16 పరీక్ష కేంద్రాలు
5,000 మంది విద్యార్థులు
మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష
విద్యార్థులు గంట ముందే హాజరవ్వాలి
ఒంటిగంటకల్లా గేట్లు మూసివేత
విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):
వైద్య కళాశాలల్లో బ్యాచిలర్ డిగ్రీ (ఎంబీబీఎస్)లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘నీట్’ ఈనెల నాలుగో తేదీన నగరంలోని 16 కేంద్రాల్లో జరగనున్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రవేశ పరీక్షకు సుమారు ఐదు వేల మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు జరగనున్న పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులను ఉదయం 11 నుంచి కేంద్రాలకు అనుమతిస్తారు. ఒంటి గంట తరువాత కేంద్రాల గేట్లు మూసివేస్తారు. అంటే గంట ముందే కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలి.
నగరంలో వీఎస్ కృష్ణా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, కంచరపాలెం కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, ఏయూలో ఆర్ట్స్ కళాశాల, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగం, ఇంజనీరింగ్ మెయిన్ బిల్డింగ్, న్యూక్లాస్రూమ్ కాంప్లెక్స్, ఇంజనీరింగ్ కళాశాలలో అల్గారిధమ్ భవనం, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇంకా తాటిచెట్లపాలెంలో ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వెనుక ఉన్న కేంద్రీయ విద్యాలయం (వాల్తేర్), మల్కాపురం గాంధీగ్రామ్, మర్రిపాలెం, ఎన్ఎడీ, ఉక్కునగరాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు.
94.96 శాతం మందికి పింఛన్లు పంపిణీ
విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో గురువారం సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. జిల్లాలో 1,59,581 మందికిగాను 1,51,539 మందికి (94.96 శాతం) రూ.65.94 కోట్లు పంపిణీ చేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,404 మందికిగాను 25,231 మందికి, నగరంలో 133,177 మందికిగాను 126,308 మందికి పింఛన్లు అందజేశారు. మిగిలిన వారికి శుక్ర, శనివారాల్లో పింఛన్ల బట్వాడా ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోని లేకపోయినా వచ్చే రెండునెలల తరువాత పింఛన్లు తీసుకునే అవకాశం కల్పించారు.