Share News

పాఠశాల పునఃప్రారంభం రోజే హాజరుకావాలి

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:11 PM

విద్యార్థులు పాఠశాల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని స్థానిక ఏటీడబ్ల్యూవో బి. జయ నాగలక్ష్మి అన్నారు.

పాఠశాల పునఃప్రారంభం రోజే హాజరుకావాలి
ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి

తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకువచ్చి అప్పగించాలి

విద్యా ప్రగతిపై టీచర్లతో మాట్లాడాలి

ఏటీడబ్ల్యూవో జయ నాగలక్ష్మి

చింతపల్లి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు పాఠశాల పునఃప్రారంభం రోజే విధిగా హాజరుకావాలని స్థానిక ఏటీడబ్ల్యూవో బి. జయ నాగలక్ష్మి అన్నారు. శనివారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఈనెల 12న పునఃప్రారంభం కానున్నాయన్నారు. వేసవి సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులను తొలి రోజే తల్లిదండ్రులు మాత్రమే తీసుకు వచ్చి పాఠశాలలో అప్పగించాలన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులను కలిసి విద్యార్థుల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు రెండు, మూడు రోజులు ఆలస్యంగా పాఠశాలలకు వస్తుంటారని, దీనివల్ల విద్యాబోధన ప్రారంభించేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. తొలి రోజు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్‌ అందజేస్తామన్నారు. పాఠశాలకు వచ్చిన వెంటనే విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయిస్తామన్నారు. వార్డెన్లు తరగతి గదులు, వసతి గృహాలు శుభ్రం చేయించి సిద్ధంగా ఉంచాలన్నారు. మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీ సీట్లు ఆశ్రమ పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించామని, తల్లిదండ్రులు ఖాళీల ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 11:11 PM