పెదగంట్యాడలో హత్య
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:47 AM
మద్యం మత్తులో ఇద్దరు మిత్రుల మధ్య రేగిన వివాదం హత్యకు దారి తీసింది.
మద్యం సేవిస్తూ గొడవపడిన స్నేహితులు
తలపై కర్రతో మోదడంతో సంఘటన
పరారైన నిందితుడు
పెదగంట్యాడ, జూన్ 22(ఆంధ్రజ్యోతి):
మద్యం మత్తులో ఇద్దరు మిత్రుల మధ్య రేగిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం పెదగంట్యాడ పారిశ్రామికవాడ స్టీల్యార్డులో జరిగింది. న్యూపోర్టు పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్కు చెందిన మహాదేవ్ (25), నగేష్ (26) స్నేహితులు. పనుల కోసం నెల రోజుల క్రితం పెదగంట్యాడ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఒక ఇంట్లోనే ఉంటూ స్థానిక పారిశ్రామికవాడలోని స్టీల్యార్డులో రాడ్బెండింగ్ పనికి కుదిరారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇద్దరూ ఇంట్లోనే మద్యం సేవస్తూ సాయంత్రం సమయంలో గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన నరేష్ కర్రతో మహాదేవ్ తలపై కొట్టడంతో అతడు ఆక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే మృతదేహాన్ని పక్కనే ఉన్న పొదల్లో పడేసి నరేష్ పరారయ్యాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో న్యూపోర్టు పోలీసులకు సమాచారం అందడంతో సీఐ కామేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చే స్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు.