కృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ పార్కు
ABN , Publish Date - May 06 , 2025 | 01:16 AM
పద్మనాభం మండలం కృష్ణాపురంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కృష్ణాపురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
నేడు శంకుస్థాపన
మొత్తం 52.13 ఎకరాలు కేటాయింపు
తొలిదశలో 21.72 ఎకరాల్లో 163 ప్లాట్లు
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.4 కోట్లు
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
పద్మనాభం మండలం కృష్ణాపురంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గానికి సంబంధించి కృష్ణాపురంలో పార్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం సర్వే నంబర్ 93లో 52.13 ఎకరాలు కేటాయించింది. అందులో తొలి దశలో 23.72 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. 300 చదరపు మీటర్ల చొప్పున 163 ప్లాట్లుగా విభజించనున్నారు. పార్కు అభివృద్ధి, ప్లాట్లు విభజన, అమ్మకాలు, తరువాత నిర్వహణ వంటివి ఏపీఐఐసీ చూసుకుంటుంది. ప్రస్తుతం తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, విద్యుత్ సౌకర్యం వంటివి కల్పించేందుకు రూ.12.4 కోట్లు కేటాయించారు. దీనికి సంబంఽధించి టెండర్లు ఆహ్వానించనున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం పార్కుకు శంకుస్థాపన చేయనున్న క్రమంలో ఏపీఐఐసీ డీజీఎం బడగల హరిధర్ సోమవారం అక్కడ పనులను పర్యవేక్షించారు. పొదలు తొలగింపు, లెవెలింగ్ పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్కు సూచనలు చేశారు. కాగా పార్కులో మౌలిక వసతుల కల్పన తరువాత ప్లాట్లు అమ్మకాలు ప్రారంభిస్తారు. ప్లాట్ల ధరపై ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నది. ప్లాట్లు కొనుగోలు చేసే ఔత్సాహికులకు అన్నివిధాలా ప్రోత్సాహకాలు వచ్చేలా జిల్లా పరిశ్రమల కేంద్రం పర్యవేక్షించనున్నది. మంగళవారం ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ టి.శివశంకర్, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్, ఇతర అధికారులు హాజరవుతారు.