భారీ తాగునీటి ప్రాజెక్టుకు కదలిక
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:39 PM
ఎలమంచిలి మునిసిపాలిటీ ప్రజల దాహార్తి తీరనుంది. రూ.125 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులను శనివారం పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది.
రూ.125 కోట్లతో నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం
టెండర్ల ప్రక్రియ పూర్తి
నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు
ఎలమంచిలి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మునిసిపాలిటీ ప్రజల దాహార్తి తీరనుంది. రూ.125 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులను శనివారం పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది.
మునిసిపాలిటీ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా చేసేందుకు ఏఐఐబీ పథకం కింద రూ.125 కోట్లతో భారీ మంచినీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. శనివారం ఎస్.రాయవరం మండలం దార్లపూడి సమీపంలో ఇందేశమ్మవాక వద్ద వరహానది పరివాహక ప్రాంతాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. పబ్లిక్ హెల్త్కు చెందిన ఇంజనీరింగ్ చీఫ్ ఎం.ప్రభాకరరావు, ఎస్ఈ కామేశ్వరరావు, ఈఈ దక్షిణామూర్తి, డీఈ మహేశ్ వరహా నది ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పంపు హౌస్లు, ఇన్ఫిల్టరేషన్ బావుల నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మునిసిపాలిటీ ప్రజలకు తాగునీటి కష్టాలు తీరినట్టే. ఉన్నతాధికారుల వెంట ఏఈలు అప్పారావు, నానాజీ ఉన్నారు.