వరికి దోమకాటు
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:37 PM
మూడు నుంచి నాలుగు వారాల క్రితం నాట్లు వేసిన వరి పొలాల్లో సుడి దోమ, తెల్లవీపు మచ్చదోమ ఆశించాయని, వీటి నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీకేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ చెప్పారు.
పలు మండలాల్లో సుడిదోమ, తెల్లవీపు మచ్చదోమలు
దబ్బుల నుంచి రసం పీల్చడంతో ఎండిపోతున్న ఆకులు
వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
బీసీటీ-కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్
రాంబిల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మూడు నుంచి నాలుగు వారాల క్రితం నాట్లు వేసిన వరి పొలాల్లో సుడి దోమ, తెల్లవీపు మచ్చదోమ ఆశించాయని, వీటి నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని బీసీటీకేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ చెప్పారు. ఈ దోమలు నీటిపై వుండి, దుబ్బుల నుంచి రసాన్ని పీల్చివేస్తాయని, దీనివల్ల వరి ఆకులు ఎర్రగా మారి ఎండిపోయినట్టు కనిపిస్తాయని చెప్పారు. సోమవారం, మంగళవారం ఎలమంచిలి, రాంబిల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పొలాలను పరిశీలించానని, ఈ ప్రాంతంతోపాటు జిల్లాలోని పలు మండలాల్లో వరి పైరును సుడి దోమ, తెల్లవీపు మచ్చదోమ ఆశించాయని ఆయన తెలిపారు. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి నాగేంద్రప్రసాద్ వెల్లడించిన వివరాలు..
అధిక తేమతో కూడిన వాతావరణం, మోతాదుకు మించి ఎరువులు వాడడం, దమ్ము సరిగా చేయకపోవడం, గట్లపై కలుపు మొక్కలు పెరిగిపోవడం వంటి కారణాల వల్ల వరి పైరును సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమలు ఆశిస్తుంటాయి. ప్రస్తుతం ఆర్జీఎల్ 2537 (శ్రీకాకుళం సన్నాలు) వరి రకానికి ఎక్కువగా ఈ దోమలు ఆశించినట్టు గుర్తించారు. బీపీటీ 5204 (సాంబ మసూరి ) తక్కువగా దోమ ఆశించింది. ఎంటీయూ 1062 (ఇంద్ర) రకానికి దోమ ప్రభావం పెద్దగా లేదు.
నివారణ చర్యలు
సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమ ప్రారంభ దశలో వుంటే ఎకరాకు ఎసిఫేట్ 75 ఎస్పీ మందు 250 నుంచి 300 గ్రాములు లేదా ఇమిడాక్లోఫ్రిడ్ లేదా ఎఽథిప్రోల్ 80 డబ్ల్యూజీ 50 గ్రాముల మందును 200 నుంచి 250 లీటర్ల నీటిలో కలిపి ఆకులు, దుబ్బులు తడిచేలా పిచికారీ చేయాలి. దోమ ఉధతి అధికంగా వుంటే లీటరు నీటికి పైమేట్రోజైన్ 50 డబ్ల్యూజీ 0.6 గ్రాములు లేదా ప్లోనికామిడ్ 50 ఎస్జీ 0.4 గ్రాములు లేదా డైనోటైప్యూరాన్ 20ఎస్జీ 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తొలుత గట్లను ఆనుకొని పైరుపై మందు నీటిని పిచికారీ చేయడం ప్రారంభించి తరువాత బొంగరం తరహాలో లోపలి వైపునకు పిచికారీ చేసుకుంటూ వెళ్లాలి. పొలంలో నీటి పూర్తిగా తీసివేసి, సాయంత్రం సమయంలో మందు నీటిని పిచికారీ చేయడం మంచిది. పొలంలో రోజుల తరబడి నీరునిల్వ లేకుండా, తరచూ బయటకు పంపుతుండాలి. అప్పుడప్పుడు పొలాన్ని ఆరబెట్టాలి. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువులు వాడాలి. కాగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సుడిదోమ, తెల్లవీపుమచ్చ దోమ ప్రభావం లేని పొలాల్లో కూడా ముందు జాగ్రత్తగా వేపనూనె లేదా నీమాస్త్రం ఒకసారి పిచికారీ చేసుకోవడం మంచిది. దోమ ఉధృతికి దోహదపడే క్వినాల్ఫాస్, ప్రొఫినోఫాస్, మిథైల్ పరాఽథియాన్, ట్రైజోఫాస్, ఫోరెట్ 10 జీ గుళికలు, సింథటిక్ పైరిత్రాయిడ్ వర్గానికి చెందిన డెల్టామెత్రిన్, సైపర్మెత్రిన్ వంటి పరులు మందులు వాడకూడదు. మరింత సమాచారం కోసం 94405 67379 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు.