Share News

వనవిహారికి మరిన్ని హంగులు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:36 PM

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం పైన్‌ తోటల్లో నిర్మించిన వనవిహారి(ఎకో టూరిజం ప్రాజెక్టు)లో అతిథులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అటవీశాఖ కార్యాచరణ ప్రారంభించింది.

వనవిహారికి మరిన్ని హంగులు
ఎకో టూరిజం మెయిన్‌ గేట్‌

కృష్ణాపురం పైన్‌ తోటల్లో పర్యాటకులకు ఆధునిక వసతుల కల్పనకు చర్యలు

రూ.70 లక్షల నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సెమీ పర్మినెంట్‌ కాటేజీల నిర్మాణానికి ప్రణాళిక

చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, కేఫ్‌టేరియా కూడా..

నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి

నవంబరు నాటికి అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయం

చింతపల్లి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం పైన్‌ తోటల్లో నిర్మించిన వనవిహారి(ఎకో టూరిజం ప్రాజెక్టు)లో అతిథులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అటవీశాఖ కార్యాచరణ ప్రారంభించింది. వనవిహారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.70 లక్షల నిధులు విడుదల చేసింది. దీంతో వనవిహారి ఆవరణలో సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌, కేఫ్‌టేరియా, గిరిజన వ్యవసాయ ఉత్పత్తుల హాట్‌ బజార్‌ నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. నవంబరు నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు.

ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగికి గత ఐదేళ్లగా పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. పర్యాటక సీజన్‌(నవంబరు నుంచి మార్చి)లో లంబసింగికి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. లంబసింగి వచ్చిన పర్యాటకులు ప్రకృతి ఒడిలో బస చేసేందుకు అనువుగా నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టు వనవిహారి గత ఏడాది అందుబాటులోకి వచ్చింది. లంబసింగికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పైన్‌ తోటల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మించారు. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. దీంతో బస చేసేందుకు వనవిహారి అత్యంత అనువుగా ఉందని పర్యాటకులు అంటున్నారు. కృష్ణాపురం పైన్‌ తోటలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే సందర్శకులు తోటల వద్ద ఆగి ఫొటోలు తీసుకొని, కొంత సమయ విశ్రాంతి తీసుకుని వెళుతుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ ఉన్నతాధికారులు కృష్ణాపురం పైన్‌ తోటల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు వనవిహారిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.25 లక్షల నిధులతో అత్యంత సహజసిద్ధంగా ప్రకృతి అందాలను ఆస్వాదించేలా వన విహారిని రూపొందించారు.

అందుబాటులో టెంట్లు

కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టులో పర్యాటకులకు అవసరమైన కనీస సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు బస చేసేందుకు పైన్‌ తోటల మధ్యలో 15 సింగిల్‌ టెంట్లు, 10 డబుల్‌ టెంట్లు గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. రన్నింగ్‌ వాటర్‌, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్‌ గేట్‌ పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. వనవిహారిలో వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాకింగ్‌ చేసేందుకు 4 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ పాత్‌ ఏర్పాటు చేశారు. పర్యాటకులు భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా ఉడ్‌ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. వన విహారి లోపల, బయట ఆకర్షణీయమైన విద్యుత్‌ కాంతులతో అలంకరించారు.

అదనపు సదుపాయాలకు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం వనవిహారి అభివృద్ధికి రూ.70 లక్షలు మంజూరు చేయడంతో అదనపు సదుపాయాలను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రధానంగా పర్యాటకులకు విలాసవంతమైన బస(లగ్జరీ స్టే) కోసం కేరళలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాక్షిక శాశ్వత(సెమీ పర్మినెంట్‌) కాటేజీలు నాలుగు నిర్మించనున్నారు. ఈ కాటేజీల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌, లివింగ్‌ ఏరియా, డ్రెస్సింగ్‌ రూమ్‌, వాష్‌ రూమ్‌, టాయిలెట్స్‌ వుంటాయి. అలాగే చిల్డ్రన్‌ పార్కు, అడ్వెంచర్‌(సాహస క్రీడలు) అందుబాటులోకి తీసుకురానున్నారు. చెట్ల పైన పర్యాటకులు అల్పాహారం, భోజనాలు చేసేందుకు 20 మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన కేఫ్‌టేరియా ఉడ్‌తో నిర్మించనున్నారు. వనవిహారిలో ట్రెక్కింగ్‌ పాత్‌ను సుందరంగా అభివృద్ధి చేయనున్నారు. స్థానిక గిరిజనులు పర్యాటకులకు అటవీ, వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు విక్రయించుకునేందుకు అనువుగా హాట్‌ బజార్‌ నిర్మించనున్నారు.

ఏడాది పొడవునా సందర్శనకు అనువుగా..

వనవిహారిని పర్యాటకులు ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా తీర్చిదిద్దేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. స్థానికులు వన భోజనాలు చేసేందుకు అనువుగా కొంత విస్తీర్ణం కేటాయించారు. ఎకో టూరిజం ప్రాజెక్టు లోపల వివిధ రకాల పూల మొక్కలు, క్రోటాన్స్‌ పెంచుతున్నారు. ఓపెన్‌ విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఆటవీశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎకో టూరిజంలో విశాలమైన పార్కింగ్‌తో పాటు పర్యాటకుల భద్రత కోసం 24 గంటలు టాస్క్‌ఫోర్సు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:09 PM