నగరానికి చేరుకున్న మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:12 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ మూడు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు.
పార్టీ కార్యాలయంలో అర్జీల స్వీకరణ
విశాఖపట్నం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ మూడు రోజుల పర్యటన కోసం గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన...వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యకర్తలతో పొటోలు దిగారు. పార్టీ కార్యాలయ ఆవరణలో నిలిపివుంచిన బస్సులో బస చేసిన లోకేశ్ను ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ, విశాఖ దక్షిణ ఇన్చార్జి సీతంరాజు సుధాకర్ తదితర నాయకులు కలిశారు.
నేడు కార్యక్రమాలకు హాజరుకానున్న లోకేశ్
మంత్రి లోకేశ్ శుక్రవారం ఉదయం 11 గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్లో అర్థ సమృద్ధి ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్కు హాజరవుతారు. అక్కడ నుంచి 11.30 గంటలకు చంద్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి ఏఐ ల్యాబ్స్ను ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు చంద్రంపాలెం పాఠశాల నుంచి బయలుదేరి రుషికొండలోని రాడిసిన్ బ్లూ హోటల్కు చేరుకుని ఏఐ ల్యాబ్స్ను వర్చువల్గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు నోవాటెల్ హోటల్కు వెళ్లి ఏరోస్పేస్ మ్యాన్యుఫ్యాక్చరింగ్పై సీఐఐ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరవుతారు. సాయంత్రం నాలుగు నుంచి 5.30 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ హాలులో జరిగే జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు నుంచి 7.30 గంటల వరకు రాడిసిన్ బ్లూ హోటల్లో భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుని రాత్రికి బస చేస్తారు.