షిప్యార్డుకు మినీరత్న
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:48 AM
విశాఖ హిందుస్థాన్ షిప్యార్డుకు మినీరత్న హోదా లభించిన విషయం తెలిసిందే.
షిప్యార్డుకు మినీరత్న
కేంద్ర మంత్రి చేతులమీదుగా సర్టిఫికెట్ ప్రదానం
మల్కాపురం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
విశాఖ హిందుస్థాన్ షిప్యార్డుకు మినీరత్న హోదా లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డిఫెన్స్ పీఎస్యూ భవన్ ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్నాథ్సింగ్ మినీరత్న సర్టిఫికెట్ను షిప్యార్డు సీఎండీ గిరిదీప్సింగ్కు అందజేశారు. ఈ సందర్భంగా గిరిదీప్సింగ్ మాట్లాడుతూ షిప్యార్డుకు మినీరత్న హోదా రావడం గర్వకారణమన్నారు. ఆవిష్కరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రహించడం, స్వావలంబన, నౌకా నిర్మాణం ద్వారా సముద్ర శిక్షణ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి షిప్యార్డు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు షిప్యార్డు అధికారులు పాల్గొన్నారు.
కార్పొరేషన్ల డైరెక్టర్లుగా నగర నేతలు
నాగవంశం, నగర/ఉప్పర, కళింగ కోమటి/కళింగ వైశ్య సంక్షేమం, అభివృద్ధి బోర్డుల్లో పలువురికి స్థానం
విశాఖపట్నం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా జిల్లాకు చెందిన పలువురికి అవకాశం లభించింది. నాగవంశం సంక్షేమం, అభివృద్ధి బోర్డు డైరెక్టర్లుగా భీమిలికి చెందిన అప్పికొండ అనంత్కుమార్ (జనసేన), గాడు సన్యాసినాయుడు, సురాల సత్యవరప్రసాద్ (టీడీపీ), తూర్పు నియోజకవర్గానికి చెందిన గాడు అప్పలనాయుడు (టీడీపీ), దక్షిణ నియోజవర్గానికి చెందిన డోకర రమణ (టీడీపీ) నియమితులయ్యారు. నగర/ఉప్పర సంక్షేమం, అభివృద్ధి బోర్డు డైరెక్టర్లుగా గంటా సత్యనారాయణ (బీజేపీ), గుర్రం నూకరాజు (గాజువాక), కళింగ కోమటి/కళింగ వైశ్య సంక్షేమం, అభివృద్ధి బోర్డు డైరెక్టర్లుగా పొట్నూరు అప్పారావు (బీజేపీ), తూర్పు నియోజకవర్గానికి చెందిన తంగుడు సంతోష్కుమార్ (టీడీపీ), పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కోరాడ శ్రీనివాసరావు (టీడీపీ), ఎంఎస్ఎంఈ సంక్షేమం, అభివృద్ధి బోర్డు డైరెక్టర్లుగా నగరానికి చెందిన నీలాపు విజయానందరెడ్డి (బీజేపీ), తూర్పు నియోజకవర్గానికి చెందిన ముగడ రాజారావు (టీడీపీ) నియమితులయ్యారు.