మినీ స్టేడియం అధ్వానం
ABN , Publish Date - May 17 , 2025 | 12:49 AM
ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పది మందికి అందించే నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్వహణను మునిసిపల్ అధికారులు గాలికొదిలేశారు. బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. వైసీపీ పాలనలో వ్యవహరించినట్టే కూటమి పాలనలో కూడా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్వహణను గాలికొదిలేసిన మునిసిపల్ అధికారులు
మందుబాబులు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన మైదానం
వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో విధ్వంసం
ఆక్రమణకు గురవుతున్న స్టేడియం స్థలం
నర్సీపట్నం, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పది మందికి అందించే నర్సీపట్నంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్వహణను మునిసిపల్ అధికారులు గాలికొదిలేశారు. బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. వైసీపీ పాలనలో వ్యవహరించినట్టే కూటమి పాలనలో కూడా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో సేదతీరడానికి, పిల్లలు సరదాగా ఆడుకోవడానికి సరైన పార్కు ఒక్కటి కూడా లేదు. దీంతో పిల్లలు, క్రీడాకారులు ఆడుకోవడానికి, వ్యాయామం చేసుకోవడానికి, మధ్య వయస్కులు, వృద్ధులు వాకింగ్కు ఎన్టీఆర్ మినీ స్టేడియంను ఆశ్రయించాల్సి వస్తున్నది. గతంలో వేసిన మొక్కలు ఇప్పుడు చెట్టుగా ఎదగడంతోపాటు కాసేపు సేదతీరడానికి బెంచీలు, క్రీడా మైదానం ఉండడంతో ఉపశమనం చెందుతున్నారు. మహిళలు, యువతీ యువకులు, క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. సెలవు దినాల్లో క్రీడా మైదానం సందడిగా వుంటుంది. వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటారు. తల్లిదండ్రులు చిన్నపిల్లలను స్టేడియానికి తీసుకొచ్చి ఆడించి, వారు కూడా కాసేపు వ్యాయామంచేసి ఇంటికి వెళుతుంటారు. అప్పుడప్పుడు రాజకీయ సభలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వేదిక అవుతుంది. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్న ఎన్టీఆర్ మినీ స్టేడియం తీవ్రనిర్లక్ష్యానికి గురవుతున్నది.
వైసీపీ హయాంలో విధ్వంసం
గత వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ మినీ స్టేడియం అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయకపోగా.. బాగున్నదాన్ని పాడు చేశారు. రోడ్డు విస్తరణ పనుల కోసం స్టేడియం ముందున్న మునిసిపాలిటీ షాపింగ్ కాంప్లెక్ పడగొట్టారు. ప్రహరీ గోడ నిర్మించకుండా వదలేశారు. డివైడర్ల మీద ఉన్న మూడు విగ్రహాలను స్టేడియంలోకి తరలించడానికి వాకింగ్ ట్రాక్ కాంక్రీట్ గట్టును ధ్వంసం చేశారు. ఇప్పటికే అలాగే వుండడంతో కొంత మంది ఆకతాయిలు ద్విచక్రవాహనాలతో ఆ మార్గం నుంచి స్టేడియంలోకి వచ్చేస్తున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా...
స్టేడియం ముందు భాగంలో మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు తీసేయడం వల్ల రక్షణ లేకుండా పోయింది. మందుబాబులకు, గంజాయి సేవించే వారికి అడ్డాగా మారింది. ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లు పడేస్తున్నారు. ఆహార వ్యర్థాలను బెంచీల మీద వదిలేస్తున్నారు. గతంలో స్టేడియంలో వాచ్మన్ ఉండేవాడు. ఐదు నెలలుగా వాచ్మన్ లేకపోవడంతో రక్షణ కొరవడింది. ఆకతాయిలు సిమెంట్ బెంచీలు ధ్వంసం చేస్తున్నారు. గతంలో స్టేడియం ముందు మునిసిపల్ దుకాణాల్లో వ్యాపారం చేసుకున్న వారంతా ఇప్పుడు స్టేడియం లోపల ఆక్రమణకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో క్రీడా మైదానం ఆక్రమణకు గురవుతున్నా... అప్పటి మునిసిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇప్పుడున్న అధికారులు సైతం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై మునిసిపల్ కమిషనర్ సురేంద్రను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. స్టేడియం అభివృద్ధికి ప్రణాళికను రూపొందిస్తున్నామని, స్పీకర్ అయ్యన్నపాత్రుడు దృష్టి పెట్టారని తెలిపారు.