Share News

కంఠారం పీహెచ్‌సీలో అందని వైద్య సేవలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 11:16 PM

మండలంలోని కంఠారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్యం రోగులకు అందడం లేదు. పీహెచ్‌సీ సిబ్బంది అసలు సమయ పాలన పాటించడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కంఠారం పీహెచ్‌సీలో అందని వైద్య సేవలు
పీహెచ్‌సీ వద్ద వైద్య సేవలకు వచ్చి నిరీక్షిస్తున్న రోగులు

సమయం పాలన పాటించని సిబ్బంది

పీహెచ్‌సీ తెరవకపోవడంతో రోగుల నిరీక్షణ

గాడిలో పెట్టాలని గ్రామస్థుల వేడుకోలు

కొయ్యూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కంఠారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్యం రోగులకు అందడం లేదు. పీహెచ్‌సీ సిబ్బంది అసలు సమయ పాలన పాటించడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంఠారం పీహెచ్‌సీలో శుక్రవారం నైట్‌ డ్యూటీ చేసిన సిబ్బంది శనివారం ఉదయం రిలీవ్‌ చేసే సిబ్బంది రాకుండా పీహెచ్‌సీ తలుపులు వేసి వెళ్లిపోయారు. దీంతో పీహెచ్‌సీకి వచ్చే రోగులకు శనివారం ఉదయం 10 గంటల వరకు వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు వచ్చిన రోగులు పీహెచ్‌సీ తలుపులు వేసి ఉండడంతో విధి లేక కొందరు ఇంటి ముఖం పట్టగా.. మరికొందరు బయట నిరీక్షించారు. పది గంటల సమయంలో వైద్యాధికారిణి భాగ్యలక్ష్మి వచ్చి తలుపులు తెరిచారు. ఈ పీహెచ్‌సీపై తగిన పర్యవేక్షణ లేకపోవడంతో తరచూ ఇదే పరిస్థితి నెలకొంటున్నదని కంఠారం గ్రామస్థులు మాకిరెడ్డి అప్పలనాయుడు తదితరులు తెలిపారు. పీహెచ్‌సీలో సీజనల్‌ రోగులకు అందించాల్సిన మందుల నిల్వలు ఉండడం లేదని వారంటున్నారు. పీహెచ్‌సీ నిర్వహణను గాడి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కంఠారం గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారిణి భాగ్యలక్ష్మిని ఫోన్‌లో సంప్రదించగా.. ఉదయం స్టాఫ్‌నర్సు రావడం అర గంట ఆలస్యమైందన్నారు. దీంతో ఈ పరిస్థితి నెలకొందని, భవిష్యత్‌లో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటానన్నారు.

Updated Date - Jul 05 , 2025 | 11:16 PM