Share News

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:30 PM

వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు.

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మాట్లాడుతున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ

అధికారులకు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే అభిషేక్‌గౌడ ఆదేశం

పాడేరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో గురువారం నిర్వహించిన జల్‌ జీవన్‌ మిషన్‌ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఇప్పటికే మరమ్మతులకు గురైన బోర్లు, తాగునీటి పథకాలను గుర్తించి బాగు చేయించాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియ సక్రమంగా జరగాలని. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా ప్రతి గ్రామంలో ఇంటింటికీ కొళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటికి సంబంధించిన విషయాల్లో ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, గ్రామ పంచాయతీల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. తాగునీటి సమస్యలకు సంబంధించిన అంశాలపై సంబంధిత సిబ్బందితో ప్రతి 15 రోజులకు ఒక మారు సమావేశం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు రాకుండా పని చేయాలన్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య కమిటీలను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా తాగునీటికి సంబంధించిన అనేక విషయాలపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కేఎస్‌ జవహర్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గ్రామ సచివాలయాల జిల్లా నోడల్‌ అధికారి పీఎస్‌ కుమార్‌, పాడేరు డివిజన్‌ పరిధిలోని ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:30 PM