26 నుంచి మీజిల్స్, రుబేల్లా టీకాలు
ABN , Publish Date - May 23 , 2025 | 12:50 AM
అనకాపల్లి జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీజిల్స్, రుబేల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నామని డీఎం అండ్ హెచ్వో ఎం.శాంతిప్రభ తెలిపారు.
అనకాపల్లి టౌన్, మే 22 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మీజిల్స్, రుబేల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నామని డీఎం అండ్ హెచ్వో ఎం.శాంతిప్రభ తెలిపారు. ఈ నెల 26 నుంచి మూడు విడతలుగా జిల్లాలో వ్యాక్సిన్ వేయించని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా వేస్తామన్నారు. మొదటి విడతగా మే 26 నుంచి 31వ తేదీ వరకు, రెండో విడత జూన్ 23 నుంచి 28వ తేదీ వరకు, మూడో విడత జూలై 21 నుంచి 26వ తేదీ వరకు ఈ ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. పీహెచ్సీలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల్లో టీకాలు వేస్తామన్నారు. మీజిల్స్, రుబేల్లా వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరంతో కూడిన నిమోనియా వ్యాధి సోకడంతో ఒంటిపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో శారీరక ఎదుగుదల తగ్గుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మీజిల్స్, రుబేల్లా ఈ మధ్యకాలంలో పిల్లలకు సోకిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యాక్సిన్ వేయించని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించాలని ఆమె కోరారు.