మోదకొండమ్మ ఉత్సవాలకు భారీ బందోబస్తు
ABN , Publish Date - May 10 , 2025 | 12:23 AM
పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా పెడతామని పేర్కొన్నారు. శక్తి టీమ్లు, డాగ్ స్క్వాడ్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా
శక్తి టీమ్లు, డాగ్ స్క్వాడ్లతో పర్యవేక్షణ
మూడు రోజులపాటు ట్రాఫిక్ మళ్లింపు
ఎస్పీ అమిత్ బర్ధార్
పాడేరురూరల్, మే 9 (ఆంధ్రజ్యోతి): పాడేరు మోదకొండమ్మ ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా పెడతామని పేర్కొన్నారు. శక్తి టీమ్లు, డాగ్ స్క్వాడ్ల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉత్సవాల సందర్భంగా మూడు రోజులపాటు భక్తుల సౌకర్యార్థం వాహనాల రాకపోకలను మళ్లిస్తున్నట్టు చెప్పారు. అరకులోయ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు వైపు నుంచి పాడేరు మీదుగా చోడవరం వైపు వెళ్లే వాహనాలు అడారిమెట్ట మీదుగా సన్యాసమ్మపాలెం రూట్లో వంతాడపల్లి చెక్పోస్టు నుంచి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. చోడవరం, అనకాపల్లి ప్రాంతాల నుంచి పాడేరు వచ్చి, ఇక్కడ నుంచి అరకులోయ, హుకుంపేట, ముంచంగిపుట్టు, పెదబయలు వెళ్లాల్సిన వాహనాలు ఎంపీడీవో కార్యాలయం పక్క నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సినిమా హాలు సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్సు వైపు వెళ్లాలన్నారు. జి.మాడుగుల, చింతపల్లి వైపు నుంచి హుకుంపేట, అరకులోయ వైపు వెళ్లవలసిన వాహనాలు సెయింట్ ఆన్ స్కూల్ జంక్షన్ నుంచి లగిశపల్లి, నక్కలపుట్టు, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సినిమాహాలు సెంటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు వెళ్లేలన్నారు. అరకులోయ, హుకుంపేట వైపు నుంచి జి.మాడుగుల, చింతపల్లి వైపు వెళ్లే వాహనాలు అడారిమెట్ట మీదుగా సన్యాసమ్మపాలెం రూట్లో వంతాడపల్లి చెక్పోస్టు నుంచి నక్కలపుట్టు మీదుగా లగిశపల్లి నుంచి సెయింట్ ఆన్ స్కూల్ జంక్షన్ నుంచి వెళ్లే విధంగా రూట్ మార్పు చేశామన్నారు. భారీ వాహనాలను మూడు రోజులపాటు ఘాట్రోడ్డులోకిగానీ, పాడేరు పట్టణంలోకిగానీ అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.