మన్యం గజగజ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:45 AM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.
జి.మాడుగులలో 5.6 డిగ్రీలు
కొనసాగుతున్న చలి తీవ్రత
పాడేరు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జి.మాడుగులలో సోమవారం 5.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, ముంచంగిపుట్టులో 6.9, అరకులోయలో 8.0, పెదబయలులో 9.4, చింతపల్లిలో 9.7, పాడేరులో, హుకుంపేటలో 10.1, కొయ్యూరులో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికి వణుకుతున్న జనం
ఏజెన్సీలో గత కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. సోమవారం ఉదయం పది గంటలు దాటే వరకు దట్టంగా పొగమంచు కురవగా, మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండ కాసింది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి చంపేస్తున్నది. జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు వేసుకుంటూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో సోమవారం పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. దీంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ముంచంగిపుట్టులో..
ముంచంగిపుట్టు: మండలంలో చలి వణికిస్తోంది. సోమవారం ఉదయం 10 గంటలు వరకు మంచు తెరలు వీడలేదు. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలవుతోంది. దీంతో ఏ వీధిలో చూసినా చలి మంటలు కనిపిస్తున్నాయి.