మన్యం గజగజ
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:30 PM
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు.
జి.మాడుగులలో 3.2 డిగ్రీలు
ఉదయం 9 గంటల వరకు వీడని పొగమంచు
పాడేరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు. గత మూడు రోజులుగా కొయ్యూరు మండలం మినహా మిగతా పది మండలాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ గురువారం ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది.
జి.మాడుగులలో 3.2 డిగ్రీలు
జి.మాడుగులలో 3.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. డుంబ్రిగుడలో 3.6, అరకులోయలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, చింతపల్లిలో 7.8, కొయ్యూరులో 11.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండలం పరిధిలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం మండల కేంద్రంలో మంచు దట్టంగా కురిసింది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడలేదు. అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది. రాత్రి వేళల్లో ఎక్కడ చూసినా చలిమంటలు కనిపిస్తున్నాయి.