వృత్తి నైపుణ్యానికి ఊతం!
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:48 PM
జిల్లాలోని నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు జిల్లా కేంద్రం పాడేరులో కొత్తగా యూత్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఐటీడీఏకు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక సహాయ పథకం నుంచి రూ.50లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. దీనిని ప్రారంభిస్తే భవిష్యత్లో గిరిజన యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికార యంత్రాంగం భావిస్తోంది.
పాడేరులో ‘యూత్ ట్రైనింగ్ సెంటర్’
కేంద్ర నిధులతో భవన నిర్మాణం
గతంలో ఉన్న వైటీసీలో కలెక్టరేట్ ఏర్పాటు
నూతన భవనం నిర్మాణంతో వృత్తి నైపుణ్య శిక్షణకు అవకాశం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
పాడేరు శివారున కుమ్మరిపుట్టు ప్రాంతంలో 2012లో అప్పటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు రూ.4 కోట్ల వ్యయంతో యూత్ ట్రైనింగ్ సెంటర్ను నిర్మించారు. దీంతో గిరిజన నిరుద్యోగులకు సంబంధించిన అన్ని రకాల వృత్తి విద్యా నైపుణ్య శిక్షణలను అందులోనే నిర్వహించే వారు. అలాగే అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన పలు శిక్షణ కార్యక్రమాలను యూత్ ట్రైనింగ్ సెంటర్లోనే నిర్వహించేవారు. ఆఖరుకు కొవిడ్ సంభవించినపుడు 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ను ఇందులోనే నిర్వహించారు. దీంతో స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్ బహుళ ప్రయోజనకారిగా అందుబాటులో ఉండేది. అయితే 2022 ఏప్రిల్లో పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు శ్రీకారం చుట్టడడంతో యూత్ ట్రైనింగ్ సెంటర్లో కలెక్టరేట్ సముదాయాన్ని ఏర్పాటుచేశారు. దీంతో అప్పటి నుంచి అక్కడే కలెక్టరేట్ కొనసాగుతున్నది. ఈ తరుణంలో జిల్లా కేంద్రంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అవసరమని అధికారులు గుర్తించారు.
కేంద్రం నిధులతో కొత్త వైటీసీ నిర్మాణం
గతంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ను కలెక్టరేట్కు కేటాయించడంతో స్థానికంగా మరో యూత్ ట్రైనింగ్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పూర్వపు కలెక్టర్ సుమిత్కుమార్, ఐటీడీఏ పీవో అభిషేక్ భావించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఐటీడీఏలకు అందించే కేంద్ర ప్రత్యేక సహాయ నిధుల్లోంచి రూ.50 లక్షలను అందుకు కేటాయించారు. ఆయా నిధులతో స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు చెందిన స్థలంలో ఆ భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనం పూర్తయినప్పటికీ ప్రారంభోత్సవం చేయలేదు. నూతన యూత్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభమైతే గతంలో వలే గిరిజన నిరుద్యోగులకు వృత్తి విద్య నైపుణ్య శిక్షణలు, ఇతర ఉచిత కోచింగ్లు ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని నిరుద్యోగులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఎటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవడంతో నైపుణ్య శిక్షణ అంతగా జరగని పరిస్థితి నెలకొంది. కొత్త ట్రైనింగ్ సెంటర్ అందుబాటులోకి వస్తే నైపుణ్య శిక్షణ అందుబాటులోకి వస్తుందని గిరిజన నిరుద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.