Share News

హార్టికల్చర్‌ హబ్‌గా మన్యం

ABN , Publish Date - May 10 , 2025 | 12:16 AM

మన్యాన్ని హార్టికల్చర్‌ హబ్‌ (ఉద్యాన పంటల కేంద్రం)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజన రైతుల ఆర్థిక ప్రగతి కోసం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన ప్రాంతానికి అనువైన ఉద్యాన పంటల మొక్కలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

హార్టికల్చర్‌ హబ్‌గా మన్యం
కిటుములలో గిరిజన రైతు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట

ఉద్యాన పంటల సాగుకు ప్రోతాహం

ఉపాధి హామీ పథకం కింద అమలు

మొక్కలు నాటడం నుంచి మూడేళ్లపాటు ఆర్థిక సాయం

19 రకాల మొక్కలు పంపిణీ

డ్రాగన్‌ఫ్రూట్‌, అవకాడోకి అధిక ప్రాధాన్యం

గత ఏడాది 7,459 గిరిజన రైతులతో 7,507 ఎకరాల్లో సాగు

ఈ ఏడాది 6,548 మంది రైతులతో 6,387 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం

వచ్చే నెల మొదటి వారం నుంచి మొక్కలు పంపిణీ

చింతపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): మన్యాన్ని హార్టికల్చర్‌ హబ్‌ (ఉద్యాన పంటల కేంద్రం)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. గంజాయికి ప్రత్యామ్నాయంగా గిరిజన రైతుల ఆర్థిక ప్రగతి కోసం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన ప్రాంతానికి అనువైన ఉద్యాన పంటల మొక్కలను రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొక్కలను మూడేళ్లపాటు సంరక్షించుకోవడానికి ఉపాధి పథకం కింద కూలి డబ్బులు అందిస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం (2024-25) 7,459 గిరిజన రైతులతో 7,507 ఎకరాల్లో ఉద్యాన పంటల మొక్కలు నాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6,548 మంది రైతులతో 6,387 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు డివిజన్‌లో వాతావరణం, నేలలు విభిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంత వాతావరణం ఉత్తర భారతదేశాన్ని పోలివుంటుంది. ఉద్యాన పంటల సాగుకి ఈ ప్రాంతం అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా నిర్ధారించారు. గిరిజన రైతులు వ్యక్తిగత అవసరాల కోసం ఉద్యాన పంటలను సాగు చేస్తుంటారు. వీటిని వాణిజ్యసరళిలో సాగు చేయడం లేదు. కాగా గంజాయి సాగుకు కేంద్రంగా ముద్రపడ్డ ఏజెన్సీలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపింది. ఏజెన్సీలో ఎక్కడా గంజాయి సాగు చేయకుండా పటిష్ఠ చర్యలు చేపట్టింది. గంజాయి సాగు చేస్తున్నవారు, రవాణా చేస్తూపట్టుబడిన వారిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దీర్ఘకాలంపాటు జైళ్లలో మగ్గేలా చేస్తున్నది. దీంతో గిరిజనులు గంజాయి సాగు, రవాణకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి రైతుల ఆర్థిక ప్రగతి కోసం సంతృప్తికరమైన ఆదాయం వచ్చేలా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడి నేలలు, వాతావరణాన్ని బట్టి ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రాంతానికి అనువైన పంటలను ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు గుర్తించి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 19 రకాల మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా నిమ్మ, అవకాడో, జీడిమామిడి, కొబ్బరి, దబ్బ, జామ, జాఫ్రా, డ్రాగన్‌ ఫ్రూట్‌, నేరేడు, మామిడి, మునగ, దానిమ్మ, సపోట, సీతాఫలం, తీపి నారింజ, చింత, మల్లె, సిల్వర్‌ ఓక్‌, పామాయిల్‌ మొక్కలను గిరిజన రైతులకు అందజేస్తున్నారు.

మూడేళ్లపాటు సాగు ఖర్చులు...

ఉద్యాన పంటలను కొత్తగా సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మూడేళ్లపాటు సాగు ఖర్చులను ప్రభుత్వం ఆందిస్తుంది. మొక్కలు నాటేందుకు గోతులు తీయడానికి, మొక్కలు నాటడానికి, మొక్కల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు, కలుపు తీత, మొక్కల చుట్టూపాదులు తీయడం వంటి పనులను ఆయా రైతులే చేసుకుంటే.. ఉపాధి హామీ పథకం ద్వారా కూలి డబ్బులు అందుతాయి. ఇంకా సస్యరక్షణ చర్యలు, ఎరువుల ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. నాటిన మొక్కలు బాగా ఎదిగే వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ పంటట సాగు చేసుకునేందుకు రెండేళ్ల పాటు నగదు ప్రోత్సాహ కాలు అందజేయనున్నది. సాగు చేసే పంటనుబట్టి ప్రతి ఏటా ఎకరానికి కనిష్ఠంగా రూ.1,874, గరిష్ఠంగా రూ.3,748 పొందవచ్చు. మొక్కలు నాటినప్పటి నుంచి ఫలసాయం రాక మొదలయ్యే వరకు ఉద్యాన శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తారు.

అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్‌కి ప్రాధాన్యం

మార్కెట్‌లో అధిక గిరాకీ వున్న అవకాడో, డ్రాగన్‌ఫ్రూట్‌ పంటలు సైతం గిరిజన ప్రాంతంలో సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రుజువుచేశారు. ఎంపికచేసిన మండలాల్లో అభ్యుదయ రైతులకు మొక్కలను పంపిణీ చేస్తున్నారు. అవకాడో మొక్కలను చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల మండలాల రైతులకు; డ్రాగన్‌ఫ్రూట్‌ మొక్కలను చింతపల్లి, జీకేవీధి, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పాడేరు మండలాల రైతులకు పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది డ్రాగన్‌ఫ్రూట్‌ 91 ఎకరాలు, అవకాడో 200 ఎకరాల్లో రైతులు నాటారు. కాగా కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో 7752 ఎకరాల్లో జీడిమామిడి, అన్ని మండలాల్లో 5,936 ఎకరాల్లో సిల్వర్‌ ఓక్‌ మొక్కలు నాటారు. భవిష్యత్తులో కాఫీ సాగు చేసే భూముల్లో సిల్వర్‌ ఓక్‌ మొక్కలు వేశారు.

వచ్చే నెల మొదటి వారంలో మొక్కలు పంపిణీ

డాక్టర్‌ డీవీ విద్యాసాగర్‌, డ్వామా పీడీ

ఈ ఏడాది ఉద్యాన పంటల సాగు చేసేందుకు అర్హులైన రైతులను గుర్తిస్తున్నాం. ఏటా ఒక్కో రైతుకు 25 సెంట్ల నుంచి ఎకరా వరకు విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేసుకునేందుకు మొక్కలు అందజేస్తాం. జూన్‌ మొదటి వారంలో మొక్కల పంపిణీ ప్రారంభం అవుతుంది. వివిధ రకాల మొక్కలు అటవీ శాఖ/ కేవీకేల నర్సీరీలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీల నుంచి సరఫరా అవుతాయి. ఈ ఏడాది 6,548 మంది రైతులతో 6,387 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.

Updated Date - May 10 , 2025 | 12:16 AM