రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:35 AM
రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించింది. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలుత రోడ్లపై దృష్టిసారిస్తామని గడిచిన ఎన్నికల ముందు ప్రకటించిన కూటమి...అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టింది.
జిల్లాలో మూడు రోడ్ల మరమ్మతులు,
ఓవర్ లేయర్కు రూ.9.35 కోట్లు కేటాయింపు
జాబితాలో విశాఖ-భీమిలి బీచ్రోడ్డు,
గంగవరం పోర్టు-నేషనల్ హైవే,
నేషనల్ హైవే వయా రేవిడి...మజ్జిపేట రోడ్లు
త్వరితగతిన పనులు పూర్తిచేసేలా
ఆర్అండ్బీ అధికారులకు ఆదేశాలు
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణంపై ప్రభుత్వం దృష్టిసారించింది. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే తొలుత రోడ్లపై దృష్టిసారిస్తామని గడిచిన ఎన్నికల ముందు ప్రకటించిన కూటమి...అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టింది. ఈ ఏడాది సంక్రాంతి పండగకు ప్రధాన రహదారులపై గుంతలు లేకుండా చేయాలని భావించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు మంజూరుచేసి, మరమ్మతులు పూర్తిచేసింది. ఇప్పుడు మరోసారి ప్రభుత్వం రాష్ట్రస్థాయి రహదారులు, జిల్లా స్థాయి ప్రధాన రహదారు లపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ రోడ్లపై గుంతలను పూడ్చడంతోపాటు అదనపు (ఓవర్ లేయర్) లేయర్ వేసేందుకు నిధులు మంజూరుచేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,104 కిలోమీటర్ల మేర పనులు చేసేందుకు వేయి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం..విశాఖ జిల్లాలో మూడు రోడ్లకు 9.35 కోట్లు మంజూరుచేసింది. తాజాగా కేటాయించిన నిధులతో విశాఖపట్నం-భీమిలి బీచ్రోడ్డు (మార్లిన్ కే రెస్టారెంట్ నుంచి తగరపువలస వరకూ)లో 6.62 కిలోమీటర్ల మేర పునర్నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.2.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే, గంగవరం పోర్టు నుంచి జాతీయ రహదారి వరకు 2.37 కిలోమీటర్లు రోడ్డు పనులకు రూ.3.2 కోట్లను మంజూరుచేసింది. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి పద్మనాభం మండలం రేవిడి, వెంకటాపురం వయా ఇందాడ, కోలాడ, మజ్జిపేట వరకు ఉన్న 9.06 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతు, అదనపు లేయర్ పనులకు రూ.3.65 కోట్లు మంజూరుచేసింది. ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కొద్దిరోజుల్లో టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చిన్న చిన్న రోడ్లు డిసెంబరులోగా, ఎక్కువ కిలోమీటర్లు ఉన్న రహదారుల పనులు మార్చిలోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు ఆర్అండ్బీ ఎస్ఈ కె.జాన్ సుధాకర్ తెలిపారు. వీలైనంత వేగంగా పనులు చేపడతామన్నారు.