లోకేశ్ ప్రజాదర్బార్
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:58 AM
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 73వ ప్రజాదర్బార్ నిర్వహించారు.
టీడీపీ కార్యాలయంలో నిర్వహణ
సమస్యలు వివరించి, వినతులిచ్చిన బాధితులు
మహారాణిపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ శనివారం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 73వ ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, వినతిపత్రాలను స్వీకరించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన బంగారి శ్రీనివాసరావు తన 5.64 ఎకరాల భూమిని కొందరు నకిలీ పత్రాలతో కాజేశారని మంత్రికి ఫిర్యాదు చేశారు. జీవీఎంసీలో ఉద్యోగావకాశాలు కల్పించాలని ‘నీతోడు సొసైటీ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్’ ప్రతినిధులు మంత్రికి విన్నవించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె చికిత్సకు సహాయం చేయాలని నెల్లూరుకు చెందిన కొప్పూరు సుధాకర్ వినతిపత్రం ఇచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో తనకున్న మూడు ఎకరాల భూమిని కొంతమంది ఆక్రమించారని, న్యాయం చేయాలని విశాఖ నగరానికి చెందిన ఎన్.నరసింహస్వామి మంత్రి లోకేశ్కు విన్నవించారు. వినతిపత్రాలన్నింటినీ పరిశీలించి, విచారణ అనంతరం పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు.