Share News

బొర్రా టోల్‌గేటుకు తాళాలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 11:04 PM

మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు వెళ్లే మార్గంలో మండల పరిషత్‌ ఏర్పాటు చేసిన టోల్‌గేటుకు శుక్రవారం స్థానిక సర్పంచ్‌ జన్ని అప్పారావు, పెసా కమిటీ సభ్యులు తాళాలు వేశారు.

బొర్రా టోల్‌గేటుకు తాళాలు
టోల్‌గేటును మూసివేస్తున్న సర్పంచ్‌ అప్పారావు, వార్డుసభ్యులు, పెసా కమిటీ సభ్యులు

మూసివేసిన సర్పంచ్‌, పెసా కమిటీ సభ్యులు

పంచాయతీకి రావలసిన వాటా ఇవ్వలేదంటున్న సర్పంచ్‌

ఇకపై పంచాయతీ, పెసా కమిటీ నిర్వహిస్తామని ప్రకటన

అనంతగిరి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు వెళ్లే మార్గంలో మండల పరిషత్‌ ఏర్పాటు చేసిన టోల్‌గేటుకు శుక్రవారం స్థానిక సర్పంచ్‌ జన్ని అప్పారావు, పెసా కమిటీ సభ్యులు తాళాలు వేశారు. ఈ సందర్భంగా బొర్రా సర్పంచ్‌ అప్పారావు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం మండల సమావేశంలో ఇక్కడ టోల్‌గేట్‌ ఏర్పాటుకు తీర్మానం చేశారన్నారు. అప్పటి నుంచి మండల పరిషత్‌ ఆధ్వర్యంలోని టోల్‌గేటును నిర్వహిస్తున్నారన్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంలో పంచాయతీకి 60 శాతం, మండల పరిషత్‌కు 40 శాతం ఇచ్చేందుకు తీర్మానం చేశారన్నారు. టోల్‌గేట్‌ ఆదాయంలో 60 శాతం పంచాయతీకి ఇవ్వలేదన్నారు. తమకు టోల్‌గేట్‌ ఇవ్వాలని పంచాయతీ మండల పరిషత్‌ అధికారులను కోరినా స్పందించలేదన్నారు. ఇందుకు నిరసనగా టోల్‌గేట్‌కు తాళం వేశామన్నారు. ఇకపై పంచాయతీ, పెసా కమిటీలు టోల్‌గేట్‌ను నిర్వహిస్తాయన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:04 PM