Share News

ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి సిద్ధం

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:25 PM

మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఏపీఐఐసీకి సంబంధించిన 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు.

   ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి సిద్ధం
రాచపల్లి రెవెన్యూలో పార్కు కోసం సిద్ధం చేసిన ఏపీఐఐసీ భూమి

రామన్నపాలెంలో 300 ఎకరాల్లో నిర్మాణానికి సన్నాహాలు

మాకవరపాలెం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఏపీఐఐసీకి సంబంధించిన 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఇటీవల పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్‌ ఈ భూములను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రాచపల్లి రెవెన్యూ రామన్నపాలెం గ్రామం వద్ద 2008లో సుమారు 300 ఎకరాల భూమిని ఏపీఐఐసీ అధికారులు తీసుకున్నారు. అయితే ఈ భూమి ఇప్పటి వరకు రైతుల సాగులోనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మించాలని నిర్ణయించడంతో ఈ భూమిని రైతుల నుంచి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా గత నెల రోజులుగా ఈ భూమిలో ఉన్న వ్యవసాయ పంటలతో పాటు చెట్లను తొలగించారు. నవంబరు నెలలో ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థ్ధాపన చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్కు నిర్మాణం కోసం భూమి పనులు పూర్తి చేసినట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 11:25 PM