సృష్టి ఊబిలో కేజీహెచ్ వైద్యులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:39 PM
సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో కేజీహెచ్ వైద్యుల ప్రమే యం ఉన్నట్టు తేలింది.
ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
మరో ముగ్గురు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రమేయంపై ఆధారాల సేకరణ
ఒకటి, రెండు రోజుల్లో మరింతమందిని అరెస్టు చేస్తారని ప్రచారం
ఆస్పత్రితో సంబంధం లేదనే అధికారుల ప్రకటనపై విమర్శలు
విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):
సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో కేజీహెచ్ వైద్యుల ప్రమే యం ఉన్నట్టు తేలింది. దీంతో ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కేంద్రంగా నవజాత శిశువుల విక్రయం జరిగినట్టు వారి విచారణలో తేలింది. ఇందులో కేజీ హెచ్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు.
జిల్లా పరిషత్ జంక్షన్ సమీపంలో అనధికారికంగా నిర్వహించిన సృష్టి ఆస్పత్రిలోనే ఈ తతంగమంతా జరిగిందని, నవజాత శిశువుల విక్రయా నికి సంబంధించిన లావాదేవీలన్నీ ఇక్కడే పూర్తిచేశారని పోలీసులు నిర్ధా రించారు. అంతేకాదు శిశువుల విక్రయానికి మధ్యవర్తులుగా వ్యవహరిం చిన ఽముగ్గురు దళారులను కూడా పోలీసులు మూడు రోజుల కిందట అరెస్టు చేశారు. దీంతో సృష్టి వ్యవహారంలో విశాఖకు చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్టయింది. అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద ని చెబుతున్నారు.
మరికొందరి ప్రమేయం
కేజీహెచ్లో పనిచేస్తున్న పీడియాట్రిక్, గైనిక్ విభాగానికి చెందిన ఇద్ద రు వైద్యులకు ఇందులో ప్రమేయం ఉందని, ఈ మేరకు ఆధారాలను సేకరించే పనిలో పోలీసులున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత వారిని విచారణకు పిలిచి అరెస్టు చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో నర్సింగ్ సిబ్బంది ప్రమేయాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వీరికి ఎంతవరకు భాగస్వామ్యం ఉందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. ఆస్పత్రి వర్గాలు మాత్రం వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సహా మరో ఐదుగురికి పోలీసుల నుంచి పిలుపువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీరంతా నేరుగా ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్లి సేవలందిం చారా.? ఇక్కడి నుంచి రిఫరల్ చేశారా.? అన్నది తేలాల్సి ఉంది.
అధికారుల తీరుపై విమర్శలు
ఇదిలా ఉండగా ఫెర్టిలిటీ వ్యవహారంలో కేజీహెచ్కు చెందిన ఇద్దరు సీనియర్ వైద్యులను అరెస్టు చేసినా, అధికారులు మాత్రం తమ ఆస్ప త్రికి సంబంధం లేదని ప్రకటన విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు అనుమతులు లేని సెంటర్లకు వెళ్లి సేవలు అందిస్తున్నా అధికారులకు తెలియకపోవడం కంటే నిర్లక్ష్యం మరొకటి ఉండదని పలువురు పేర్కొం టున్నారు. ఇప్పటికైనా అంతర్గత విచారణ జరిపించి ఇందులో ఎవరెవరు భాగస్వాములనే విషయాన్ని తెలుసుకుంటే మేలని, మీడియాను నిందించడం సమంజసం కాదని పలువురు పేర్కొంటున్నారు.