గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా కైలాసగిరి
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:02 AM
కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా మారుస్తామని ఎంపీ ఎం.శ్రీభరత్ వెల్లడించారు.
వచ్చే 30 ఏళ్లకు మాస్టర్ ప్లాన్
ఎంపీ ఎం.శ్రీభరత్
విశాఖపట్నం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా మారుస్తామని ఎంపీ ఎం.శ్రీభరత్ వెల్లడించారు. ఆయన మంగళవారం కైలాసగిరి అభివృద్ధి కమిటీ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, ఎంసీ తేజ్ భరత్లతో కలిసి కైలాసగిరిపై పర్యటించారు. రాబోయే ముప్పై ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారుచేయాలని అధికారులు, కమిటీకి సూచించారు. కొండపైకి కొత్తగా మరో రహదారి, మెర్జింగ్ పాయింట్లు, పార్కింగ్ సదుపాయాల విస్తరణ, వారాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ, ఉచిత బస్సులు, బ్యాటరీ వాహనాలు వంటి అంశాలపై చర్చించారు. ఆ తరువాత సిరిపురంలో వీఎంఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా అధికారులు, కమిటీతో చర్చించారు. పర్యాటకులకు భద్రత కల్పించే విషయంలో అన్ని శాఖలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సమన్వయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, కైలాసగిరిపై క్యాంటీన్లు, కొత్త టాయ్ ట్రైన్ ప్రాజెక్టు గురించి ప్రతిపాదించారు. పర్యావరణం దెబ్బతినకుండా రాబోయే రెండేళ్లకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఎంపీ సూచించారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ కైలాసగిరిపై పోలీస్ అవుట్ పోస్టు పెట్టాలన్నారు. చైర్మన్ ప్రణవ్గోపాల్ మాట్లాడుతూ, ఫస్ట్ ఎయిడ్ సెంటర్తో పాటు, అగ్నిమాపక నియంత్రణ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రమేశ్, భీమిలి ఆర్డీఓ సంగీత్ మాధుర్, చీఫ్ ఇంజనీర్ భవానీ శంకర్, సెక్రటరీ మురళీకృష్ణ, ఏడీసీసీ నరసింహమూర్తి, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.