ఏషియన్ అథ్లెటిక్స్ టోర్నీకి జ్యోతి
ABN , Publish Date - May 10 , 2025 | 12:34 AM
నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్, ఒలింపియన్ ఎర్రాజీ జ్యోతి మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికైంది.

విశాఖపట్నం, స్పోర్ట్సు, మే 9 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చెందిన అంతర్జాతీయ అథ్లెట్, ఒలింపియన్ ఎర్రాజీ జ్యోతి మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికైంది. ఈనెల 27 నుంచి సౌత్ కొరియాలోని గుమిలో జరగనున్న ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీలో భారత జట్టుకు జ్యోతి ప్రాతినిధ్యం వహించనున్నది. దేశంలో అత్యంత వేగవంతమైన అథ్లెట్గా గుర్తింపుపొందిన జ్యోతి భారత్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా హర్డలర్గా ప్రత్యేకతను సంపాదించుకుంది. గతంలో ఏషియన్ గేమ్స్లో రజత పతకం, ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్వర్ణం, వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో కాంస్య పతకం సాధించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 100 మీటర్ల హర్డిల్స్లో పతకాలు సాధించింది. ఏషియన్ చాంపియన్షిప్ టోర్నీలో జ్యోతి పాల్గొననుండడంపై జిల్లా కలెక్టర్ హరేంద్రప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, శాప్ చైర్మన్ రవినాయుడు, డీఎస్డీవో జూన్ గ్యాలియట్, ద ఒలింపిక్ సంఘం ప్రతినిధులు కంచరాన సూర్యనారాయణ, మోహన్తోపాటు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు, అప్పలరాజు, రాంకుమార్ తదితరులు హర్షం వ్యక్తంచేస్తూ దేశానికి పతకం అందించాలని ఆకాంక్షించారు.