ఏయూలో అక్రమాలపై విచారణ
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:00 AM
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్హత లేనివారికి కీలక పదవులు ఇచ్చిన తీరుపై విచారణ జరుగుతోంది.
మాజీ వీసీ ప్రసాదరెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలపై విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్టు ఇప్పటికే మంత్రి ప్రకటన
కొనసాగుతున్న ఎంక్వయిరీ?
మరో మూడు నెలలు పట్టే అవకాశం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అర్హత లేనివారికి కీలక పదవులు ఇచ్చిన తీరుపై విచారణ జరుగుతోంది. అందరి లెక్కలు తేల్చే పని చాపకింద నీరులా సాగుతోంది. ఇది కొలిక్కి రావడానికి ఇంకో మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు పాతరేసి నచ్చినట్టుగా వ్యవహరించిన వారందరిపైనా ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. కీలకమైన వ్యక్తులు కటకటాల వెనక్కి వెళుతున్నారు. కక్ష సాధింపులో భాగంగా ఇవన్నీ చేస్తోందనే అపవాదు రాకుండా ప్రభుత్వం విచారణ విభాగాల ద్వారానే తప్పులను వెలికితీసి, వాటికి కారకులు ఎవరో గుర్తించి, చట్టపరంగా కేసులు పెట్టి కారాగారానికి పంపుతోంది. విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే...ఇక్కడ అన్నీ తానై వ్యవహరించిన నాటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి భీమిలి బీచ్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పటికే చర్యలు చేపట్టారు. పునాదులు తొలగించారు.
ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటి వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి వైసీపీ నాయకుడిలా పనిచేశారు. సరస్వతీ నిలయాన్ని వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చేశారు. జీవీఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వార్డుల్లో వైసీపీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇంకా రూ.20 కోట్ల రూసా నిధులు వినియోగం, ఇస్రో నుంచి వచ్చిన రూ.25 లక్షల ఖర్చులో నిబంధనలు ఉల్లంఘించారనే విమర్శలు వచ్చాయి. అలాగే ఏయూ ప్రొఫెసర్లను పక్కనపెట్టి బయట వారిని తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భారీ వేతనాలతో ఉద్యోగాల కల్పన, రిటైర్డ్ ప్రొఫెసర్లకు అడ్డగోలుగా పదవులు, అర్హత లేని వారికి ఉన్నత పదవులు ఇవ్వడం, టీడీఆర్ హబ్ ద్వారా పీహెచ్డీ ప్రవేశాల్లో అక్రమాలు, టెండర్లు లేకుండానే క్యాంపస్లో ఎక్కడికక్కడ క్యాంటీన్లు పెట్టుకునేందుకు అనుమతులు...ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉన్నాయి. ప్రభుత్వం మారగానే ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. ఏదో ఒకటి చేస్తారని ఆయన కూడా కొన్నాళ్లు సెలవు పెట్టి వెళ్లిపోయారు. క్యాంపస్ నిండా తన మనుషులే కాబట్టి విచారణ చేపట్టినా ఏమీ కాదని భావించారు. మళ్లీ విధుల్లో చేరారు. అయితే మూడు నెలల కిందట అసెంబ్లీలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్రాజు వంటి వారంతా ప్రసాదరెడ్డి వ్యవహారాన్ని ప్రస్తావించారు. దీంతో అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విజిలెన్స్ విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఇప్పటివరకూ విజిలెన్స్ విచారణ చేపట్టలేదని అంతా భావిస్తున్నారు. కానీ విచారణ జరుగుతోందని, చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని ఎంపీ శ్రీభరత్ శనివారం స్పష్టంచేశారు. ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ కొత్త వారితో టీమ్ ఏర్పాటు చేసుకున్నారని, కొత్తపాలన మొదలవుతుందన్నారు. ఏదీ కక్ష సాధింపుతో చేయబోమని, చట్టప్రకారమే కచ్చితంగా చర్యలు ఉంటాయని, కాకపోతే కొద్దిరోజులు వేచి ఉండాలని ఎంపీ చెప్పారు.