కోడూరుకు పారిశ్రామిక శోభ
ABN , Publish Date - Jul 04 , 2025 | 12:24 AM
జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి మండలం కోడూరులో పారిశ్రామిక పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి 350కిపైగా దరఖాస్తులు అందగా, వాటిని కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు ఇప్పటికే అన్ని అర్హతలు కలిగిన 171 మందికి స్థలాల కేటాయింపులు జరుపుతున్నారు.
- 171 ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటుకు పచ్చజెండా
- రూ.59.47 కోట్లతో మౌలిక వసతుల కల్పన
- చురుగ్గా రోడ్లు, విద్యుద్దీకరణ, భూగర్భ డ్రైనేజీ పనులు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి మండలం కోడూరులో పారిశ్రామిక పార్కు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి 350కిపైగా దరఖాస్తులు అందగా, వాటిని కలెక్టర్ విజయకృష్ణన్ ఆధ్వర్యంలో పరిశీలించిన ఏపీఐఐసీ అధికారులు ఇప్పటికే అన్ని అర్హతలు కలిగిన 171 మందికి స్థలాల కేటాయింపులు జరుపుతున్నారు. ఈ పార్కులో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థకు స్థలాన్ని కేటాయించనున్నారు. ప్రతి యూనిట్కు 300 చదరపు మీటర్ల విస్తీర్ణం చొప్పున ఇప్పటికే 250 ప్లాట్లను సిద్ధం చేశారు. వీటిలో 45 ఎస్సీలకు, 17 ఎస్టీ తెగలకు కేటాయించనున్నారు. మిగిలినవి ఓపెన్ కేటగిరీలో కేటాయింపులు జరుపుతున్నారు. చదరపు మీటరు రూ.5,090 ధరకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
చురుగ్గా అభివృద్ధి పనులు
సుమారు 59 ఎకరాల్లో రూ.59.47 కోట్లు కేటాయించి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ పార్కులో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇటీవల ఈ పనులను కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. విశాలమైన రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం బోర్లు ఆధారంగా నీరు అందిస్తున్నా, భవిష్యత్తులో ఏలేరు కాలువ నుంచి నీరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కు ప్రాంతంలో నీటి వసతుల కల్పన పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. 171 ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అనుమతులు జారీ చేసిన అధికారులు పార్కులో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి, ఆరు నెలల్లో పరిశ్రమలు ప్రారంభించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పరిశ్రమల ద్వారా సుమారు రూ.100 కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్నారు. చిన్న పరిశ్రమల్లో 70 శాతం స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన ఎంఓయూలు పారిశ్రామికవేత్తలతో చేసుకోనున్నారు. కోడూరు ఎంఎస్ఎంఈ పార్కులో కొత్తగా పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు ఏపీఐఐసీ అచ్యుతాపురం జోనల్ మేనేజర్ ఎస్.నర్సింహరావు తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు.