Share News

అతీగతీ లేని షాపింగ్‌ కాంప్లెక్సులు

ABN , Publish Date - May 06 , 2025 | 12:35 AM

ఏజెన్సీలోని ఐటీడీఏ షాపింగ్‌ కాంప్లెక్సులు కొన్ని చోట్ల అనర్హుల ఆధీనంలో ఉండగా, మరికొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. అద్దెలు చెల్లించకుండా కొందరు దుకాణాలను నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

అతీగతీ లేని షాపింగ్‌ కాంప్లెక్సులు
రాజేంద్రపాలెం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్సులో అద్దెలు చెల్లించకుండా కొనసాగుతున్న దుకాణాలు

అనర్హుల ఆధీనంలో కొన్ని, నిరుపయోగంగా మరికొన్ని..

అద్దెలు చెల్లించకుండా దర్జాగా కొనసాగుతున్నా పట్టించుకోని ఐటీడీఏ

గిరిజన యువత కోసం నిర్మించినా దక్కని ఫలితం

కొయ్యూరు, మే 5(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలోని ఐటీడీఏ షాపింగ్‌ కాంప్లెక్సులు కొన్ని చోట్ల అనర్హుల ఆధీనంలో ఉండగా, మరికొన్ని చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. అద్దెలు చెల్లించకుండా కొందరు దుకాణాలను నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గిరిజన యువత చిరు వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటారనే ఉద్దేశంతో రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ షాపింగ్‌ కాంప్లెక్సులు అర్హులకు దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పాడేరు ఐటీడీఏ పరిధిలో 1985 నుంచి 1991 మధ్య కాలంలో మండలంలో మూడు షాపింగ్‌ కాంప్లెక్సులను ఐటీడీఏ నిర్మించింది. నెలకు రూ.100 అద్దెతో మండలంలో అర్హులైన వారిని ఎంపిక చేసి ఐటీడీఏ అధికారులు కేటాయించారు. అయితే చాలా చోట్ల ఆ దుకాణాలు అనర్హుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. కొన్నేళ్లుగా వీరు అద్దెలు కూడా చెల్లించడం లేదు. మూడేళ్లకోసారి దుకాణాల కేటాయింపులు జరపాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఐటీడీఏ ఆదాయానికి గండి పడుతోంది. కాగా దుకాణాల నిర్వాహకులు ఈ షాపులను వేరొకరికి ఎక్కువ అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.

ఏజెన్సీ 11 మండలాల్లో ఒక్కో మండలంలో సుమారు 8 నుంచి 12 షాపుల వరకు ఉంటాయి. అయితే వీటిలో సగానికి పైగా షాపులు అనర్హుల చేతుల్లో ఉన్నాయి. షాపింగ్‌ కాంప్లెక్సులు ఉన్నాయనే సంగతి ఐటీడీఏ పీవోకే తెలియని పరిస్థితి ఉంది. మండల పరిషత్‌ అధికారుల అండదండలతో అనర్హులు దుకాణాలను సొంతం చేసుకున్నారని, అద్దెలు కట్టకుండా దర్జాగా కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి ఈ షాపింగ్‌ కాంప్లెక్సులకు మరమ్మతులు చేయించి అర్హులకు కేటాయించాలని గిరిజన సంఘాల నాయకులు కోరుతున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:35 AM