ఆదాయం రూ.34,34,43,000
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:28 AM
మునిసిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దులు ద్వారా రూ.34,34,43,000 ఆదాయం వస్తుందని, రూ.42,30,40,500 ఖర్చు అవుతుందని అంచనా వేశామని కమిషనర్ జంపా సరేంద్ర తెలిపారు.
వ్యయం రూ.42,30,40,500
‘పట్నం మునిసిపాలిటీ 2026-27 అంచనా బడ్జెట్
ప్రజారోగ్య శాఖకు పెద్దపీట
బడ్జెట్ బాగుందని టీడీపీ కౌన్సిలర్ పద్మావతి ప్రశంస
నర్సీపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
మునిసిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ పద్దులు ద్వారా రూ.34,34,43,000 ఆదాయం వస్తుందని, రూ.42,30,40,500 ఖర్చు అవుతుందని అంచనా వేశామని కమిషనర్ జంపా సరేంద్ర తెలిపారు. సోమవారం కౌన్సిల్ హాలులో చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన జరిగిన మునిసిపల్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముగింపు నిల్వ రూ.10,36,63,000లను 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వగా తీసుకున్నామని, ఇదే సంవత్సరం ముగింపు నిల్వ రూ.2,40,65,988 ఉంటుందని అంచనా వేశామని వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీధి దీపాల నిర్వహణకు రూ.1.72 కోట్లు, నీటి సరఫరాకు రూ.2.48 కోట్లు, ప్రజారోగ్య శాఖకు రూ.4.91 కోట్లు, ఇంజనీరింగ్ విభాగానికి రూ.2.86 కోట్లు, సాధారణ నిర్వాహణ ఖర్చులకు రూ.37.9 లక్షలు, పట్ణణ ప్రణాళీకరణకు రూ.36.5 లక్షల చొప్పున కేటాయించామని కమిషనర్ తెలిపారు. అనంతరం జరిగిన చర్చలో 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి (టీడీపీ) మాట్లాడుతూ, గతంతో పోల్చితే ఈసారి బడ్జెట్ చాలా బాగుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రాబోయే మూడు నెలలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలో అభివృద్ధి పనులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం నుంచి రూ.4.11 కోట్లు, వీఎంఆర్డీఏ నుంచి రూ.9.11 కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. బలిఘట్టంలో వాలీబాల్ కోర్టు, అయ్యన్నపాలెంలో షటిల్ కోర్టు, శివపురంలో బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీఎస్ఆర్ నిధులతో శ్మశానవాటికను అభివృద్ధి చేయించామని తెలిపారు.