సరుగుడు సాగుకు మొగ్గు
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:42 AM
వరి, చెరకు పంటల సాగు ఖర్చులు, పెట్టుబడి పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అరకొర మద్దతు ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ పలువురు రైతులు సరుగుడు తోటల సాగుకు మొగ్గుచూపుతున్నారు.
ఏటేటా పెరుగుతున్న విస్తీర్ణం
వరి, చెరకు సాగు భారంగా మారడమే కారణం
ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల చూపు
రావికమతం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
వరి, చెరకు పంటల సాగు ఖర్చులు, పెట్టుబడి పెరిగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అరకొర మద్దతు ధరలు గిట్టుబాటు కావడం లేదంటూ పలువురు రైతులు సరుగుడు తోటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గత సీజన్ వరకు చెరకు సాగు చేసిన రైతులే వున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా నుంచి పేమెంట్ల వరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, వచ్చే సీజన్లో చెరకు క్రషింగ్ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొనడంతో సరుగుడు నాట్లు వేస్తున్నట్టు చెబుతున్నారు.
కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు సరుగుడు మొక్కలు నాటుతున్నారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేకపోవడం, నికరంగా ఆదాయం వచ్చేఅవకాశం వుండడంతో వరి, చెరకు సాగు చేసిన భూముల్లో సరుగుడు వేస్తున్నట్టు చెబుతున్నారు. ఎకరా విస్తీర్ణంలో వరి సాగుకు రూ.30-35 వేలు, చెరకు సాగుకు రూ.50-60 వేలు పెట్టుబడి అవుతున్నది. దీనికితోడు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుంటే కొన్నిసార్లు పెట్టుబడి కూడా రావడంలేదు. కుటుంబ సభ్యుల శ్రమపాటు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. అదే సరుగుడు (రకాన్నిబట్టి) సాగు చేసుకుంటే ఎకరాకు ఐదేళ్లపాటు గరిష్ఠంగా రూ.40 వేలు పెట్టుబడి అవుతుంది. ఎకరాకు గరిష్ఠంగా 60-70 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం పేపర్ మిల్లులు టన్ను రూ.6-7 వేలకు కొనుగోలు చేస్తున్నాయి. ఐదేళ్లకు ఖర్చులుపోను రూ.4 లక్షల వరకు మిగులుతాయి. ఏటా ఎకరాకు సగటున రూ.80 వేలు ఆదాయం వస్తుంది. నాలుగైదేళ్ల క్రితం వేసిన సరుగుడు తోటలు ప్రస్తుతం కోతకు రావడం, ఆయా రైతులు సంతృప్తికరమైన ఆదాయం పొందుతుండడంతో చెరకు, వరి సాగుచేసే రైతులు ఈ పంటలకు స్వస్తిపలికి సరుగుడు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో మెట్ట, బంజరు భూములు, గరప నేలల్లో మాత్రమే సరుగుడు తోటలు సాగు చేసేవారు. కొన్నేళ్ల నుంచి వరి, చెరకు సాగు చేసే పల్లం , నల్లరేగడి భూముల్లో కూడా సరుగుడు వేస్తున్నారు. పొలాలను కౌలుకు ఇద్దామంటే ఎవరూ ముందుకు రావడంలేదని, వ్యక్తిగత కారణాల వల్ల చెరకు, వరి వంటి పంటలను తాముసాగు చేసే పరిస్థితి లేదని, ఇటువంటి తరుణంలో భూములను ఖాళీగా వుంచలేక సరుగుడు నాట్లు వేయిస్తున్నామని పెద్ద కమతాలు వున్న రైతులు చెబుతున్నారు. పలువురు రైతులు సరుగుడు సాగుకు ఆసక్తి చూపుతుండడంతో నారుకు డిమాండ్ పెరిగింది. ట్రేలలో పెంచిన హైబ్రిడ్ నారు మొక్కలు ఒక్కొక్కటి రూ.2కు నర్సరీల నిర్వాహకులు విక్రయిస్తున్నారు. సాధారణ నారు అయితే ఒక్కో మొక్క రూపాయికి అమ్ముతున్నారు. ఎకరాకు 4-5 వేల మొక్కలు వేస్తున్నారు. ఐదేళ్ల తరువాత 50 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని, అప్పటి ధరనుబట్టి ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు.