Share News

అక్రమంగా డీజిల్‌ నిల్వ

ABN , Publish Date - May 02 , 2025 | 12:57 AM

డీజిల్‌ను దొంగచాటుగా తీసుకొచ్చి నిల్వ ఉంచిన గోడౌన్‌పై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం దాడి చేశారు.

అక్రమంగా డీజిల్‌ నిల్వ

గాజువాక ఆటోనగర్‌లో గల గోడౌన్‌పై విజిలెన్స్‌ దాడి

20 వేల లీటర్లు స్వాధీనం

దొంగచాటుగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నట్టు గుర్తింపు

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

డీజిల్‌ను దొంగచాటుగా తీసుకొచ్చి నిల్వ ఉంచిన గోడౌన్‌పై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం దాడి చేశారు. ఎలాంటి పన్ను చెల్లించకుండా నిల్వ ఉన్న 20 వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. గాజువాక ప్రాంతానికి చెందిన పి.సర్వేశ్వరరెడ్డి ఆటోనగర్‌ సెక్టార్‌-4లో అక్రమంగా డీజిల్‌ గోడౌన్‌ను ఏర్పాటుచేసుకున్నారు. అనుమతులు లేకుండా డీజిల్‌ను నిల్వ చేసి, విక్రయిస్తున్నారంటూ కొంతమంది పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆటోనగర్‌లోని గోడౌన్‌పై విజిలెన్స్‌ అధికారులు గురువారం దాడి చేయగా 20 వేల లీటర్ల డీజిల్‌ లభ్యమైంది. దానిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై సరైన ఆధారాలు చూపలేదు. అలాగే గోడౌన్‌కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, జీఎస్‌టీ సర్టిఫికెట్‌ కూడా లేదని గుర్తించారు. డీజిల్‌ను దొంగచాటుగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు విజిలెన్స్‌ అధికారులు నిర్ధారించారు. దీంతో జీఎస్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వచ్చి రూ. పది లక్షలు జరిమానా విధించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు 6ఏ కేసు నమోదుచేశారు.

Updated Date - May 02 , 2025 | 12:57 AM