పీ4లో మార్గదర్శులను గుర్తించండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:46 PM
పీ4లో బంగారు కుటుంబాలు, వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ దినేశ్కుమార్ ఆదేశం
వెనుకబడిన ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలు
పాడేరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): పీ4లో బంగారు కుటుంబాలు, వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. పీ4పై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పీ4లో చేపట్టాల్సిన ప్రక్రియలను అధికారులు వేగవంతం చేయాలన్నారు. మండలాల వారీగా బంగారు కుటుంబాలు, మార్గదర్శిల వివరాలను సిద్ధం చేయాలని, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులే పూర్తి బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 329 సచివాలయాల్లోని 16,050 కుటుంబాలు, 1 లక్షా 24 వేల 557 మంది సభ్యులను మార్గదర్శిలు దత్తత తీసుకున్నారన్నారు. అయితే జిల్లాలో ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలు పీ4 అమలులో చాలా వెనుకబడ్డాయన్నారు. లక్ష్యం మేరకు అన్ని మండలాల్లో బంగారు కుటుంబాలు, మార్గదర్శిల ఎంపిక ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం మండల, సచివాలయ స్థాయిలో ఆశించిన పురోగతి లేదని, అవసరమైన చర్యలు మరింత వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో బంగారు కుటుంబాల స్థితిగతులపై పరిశీలన జరిపి వారి అవసరాలను పక్కాగా గుర్తించాలన్నారు. అలాగే వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఐవీఆర్ఎస్లో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎంజే.అభిషేక్గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు సింహాచలం, అపూర్వభరత్, సబ్కలెక్టర్లు శౌర్యమన్పటేల్, శుభం నొక్వాల్, డీఆర్వో కె.పద్మలత, పీ4 నోడల్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, సీపీవో ప్రసాద్, డీఆర్డీఏ పీడీ వి.మురళీ, డ్వామా పీడీ విద్యాసాగర్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాలసుందరంబాబు, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, అధికారులు పాల్గొన్నారు.