గిరిజనులకు గృహ యోగం
ABN , Publish Date - Nov 13 , 2025 | 01:21 AM
జిల్లాలోని గిరిజనులకు గృహ యోగం కలిగింది. పీఎం జన్మన్ యోజనలో మంజూరైన ఇళ్లలో బుధవారం 11,598 ఇళ్లకు ఘనంగా గృహ ప్రవేశాలు నిర్వహించారు. పేదలకు సొంతిల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి నుంచి ఆయా ఇళ్లకు వర్చువల్గా గృహప్రవేశాలను చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని ఘనంగా నిర్వహించారు.
- జిల్లాలో 11,598 గృహ ప్రవేశాలు
- అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి నుంచి వర్చువల్గా గృహ ప్రవేశాలు చేసిన సీఎం చంద్రబాబునాయుడు
- అనంతరం లబ్ధిదారులకు తాళాల అందజేత
పాడేరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజనులకు గృహ యోగం కలిగింది. పీఎం జన్మన్ యోజనలో మంజూరైన ఇళ్లలో బుధవారం 11,598 ఇళ్లకు ఘనంగా గృహ ప్రవేశాలు నిర్వహించారు. పేదలకు సొంతిల్లు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి నుంచి ఆయా ఇళ్లకు వర్చువల్గా గృహప్రవేశాలను చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వాటిని ఘనంగా నిర్వహించారు.
పాడేరు నియోజకవర్గంలో 5,033 ఇళ్లకు గృహ ప్రవేశాలు
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లో మొత్తం 5,033 ఇళ్లకు బుధవారం గృహ ప్రవేశాలు జరిగాయి. కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, హౌసింగ్ పీడీ బి.బాబు పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ సప్పిపుట్టు గ్రామంలో గృహప్రవేశాలు చేశారు. అలాగే అరకులోయ అసెంబ్లీ స్థానంలోని అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మొత్తం 3,221 ఇళ్లు కాగా, అరకులోయ మండలం సిమిలిగూడ గ్రామంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, హౌసింగ్ ఈఈ వి.రాజబాబు లాంఛనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గంలోని పదకొండు మండలాలకు మొత్తం 3,344 ఇళ్లు పూర్తికాగా, కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలంలో ఎమ్మెల్యే శిరీషాదేవి, ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ గృహప్రవేశాలను నిర్వహించి లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేశారు. తమ సొంతింటి కల నెరవేరడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.