ఇదిగో...అదిగో...
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:04 AM
పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) బీచ్రోడ్డులో రూ.2.2 కోట్లతో హెలికాప్టర్ మ్యూజియం నిర్మించింది.
యుహెచ్-3హెచ్ మ్యూజియం ప్రారంభోత్సవంలో జాప్యం
ఆరు నెలలుగా ఎదురుచూపులు
ఆదాయం కోల్పోతున్న వీఎంఆర్డీఏ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పర్యాటక అభివృద్ధిలో భాగంగా విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) బీచ్రోడ్డులో రూ.2.2 కోట్లతో హెలికాప్టర్ మ్యూజియం నిర్మించింది. దీని పనులు ఈ ఏడాది జనవరిలోనే పూర్తయ్యాయి. అయితే ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తీరిక దొరకడం లేదు. ఆరు నెలల నుంచి ఇదిగో...అదిగో అంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
టీయూ-142 యుద్ధ విమానం, సీ హ్యారియర్ హెలికాప్టర్ మ్యూజియాన్ని ఆనుకుని...హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటుచేశారు. చుట్టూ అద్దాలు ఏర్పాటుచేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విశాఖపట్నం వచ్చే పర్యాటకులు కురుసుర సబ్మెరైన్, టీయూ-142, సీ హ్యారియర్ మ్యూజియాలతో పాటు దీనిని కూడా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అది ఇంకా ప్రారంభించలేదని అక్కడి సిబ్బంది చెబుతుండడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. దీనివల్ల వీఎంఆర్డీఏ ఆదాయాన్ని కూడా కోల్పోతుంది. సీఎం చంద్రబాబునాయుడుతో పాటు ఐటీ శాఖ మంత్రి లోకేశ్, పురపాలక శాఖ మంత్రి నారాయణ తరచూ నగరానికి వస్తున్నారు. పది నిమిషాలు తీరిక చేసుకుంటే దీని ప్రారంభోత్సవం జరిగిపోతుంది. పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. దీనిపై తక్షణమే తగిన నిర్ణయం తీసుకొని ఈ మ్యూజియాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావలసి ఉంది.
పదిహేడేళ్లు సేవలు
యుహెచ్-3 హెచ్ హెలికాప్టర్ నేవీలో పదిహేడేళ్లు సేవలు అందించింది. తీర ప్రాంత రక్షణ, విపత్తు సమయాల్లో సహాయక చర్యలు, సముద్రంలో తప్పిపోయిన వారిని గుర్తించి, రక్షించడం వంటి విధులు విజయవంతంగా నిర్వహించింది. గత ఏడాది జూన్ 28వ తేదీన ఐఎన్ఎస్ డేగాలో డీ కమిషనింగ్ జరిగింది. జిల్లాకు ఇస్తామని మ్యూజియంగా మార్చాలని తూర్పు నౌకాదళం కోరగా కలెక్టర్ అంగీకరించారు. దానికి అవసరమైన 23 సెంట్ల స్థలాన్ని బీచ్రోడ్డులో కేటాయించారు. సీఎం చంద్రబాబు దీనిపై సమీక్షించినప్పుడు 2025లో న్యూఇయర్ బహుమతిగా అందిస్తామని వీఎంఆర్డీఏ అధికారులు చెప్పారు. అనుకున్నట్టుగానే సంక్రాంతికి సిద్ధం చేశారు. అప్పటి నుంచి ప్రారంభోత్సవానికి ఎదురు చూస్తోంది.