కుమ్మేసిన వాన
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:15 AM
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది.
- పలు మండలాల్లో భారీ వర్షం
- చింతపల్లి మండలంలో పిడుగుపాటుకు ఐదు మేకలు, పశువు మృతి
చింతపల్లి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉంది. మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వర్షం కురిసింది. చింతపల్లి మండలంలోని కొత్తపాలెం పంచాయతీ జున్నుల గ్రామంలో పిడుగుపాటుకు ఐదు మేకలు, ఒక పశువు మృతి చెందింది. ఆ గ్రామానికి చెందిన సాగిన రాజారావుకి చెందిన మేకలు, పశువులను మేతకు గ్రామ శివారు పొలాల వద్దకు తీసుకొని వెళ్లారు. అయితే వర్షానికి ఓ చెట్టు కిందనున్న మేకలు, పశువుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాయి.
సీలేరులో...
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉక్కపోత, ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోయారు. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో సీలేరులో లోతట్టు ప్రాంతమైన అల్లూరివీధి, దుర్గావీధిలో వర్షపు నీరు ప్రవహించడంతో జనం ఇబ్బంది పడ్డారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి.
అరకులోయలో..
అరకులోయ: మండలంలోని బస్కీ గ్రామంలో శనివారం పిడుగుపడి కిండంగి భానుప్రసాద్ అనే వ్యక్తితో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశువులను మేపడానికి గ్రామ సమీపంలోకి వెళ్లడంతో పిడుగుపడి వీరికి గాయాలయ్యాయి. వీరికి అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.