కుమ్మేసిన వాన
ABN , Publish Date - May 16 , 2025 | 12:35 AM
మన్యంలో గురువారం భారీ వర్షం కురిసింది. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కేంద్రంలో పిడుగుపడి 9 మేకలు మృతి చెందాయి. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, ముంచంగిపుట్టులో కుండపోత వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పాడేరులో 34.3, కొయ్యూరులో 33.0, అనంతగిరిలో 32.9, జి.మాడుగులలో 32.0, డుంబ్రిగుడలో 31.2, అరకులోయ, హుకుంపేటలో 30.1, పెదబయలులో 29.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హుకుంపేటలో పిడుగుపాటుకు 9 మేకలు మృతి
- పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం
పాడేరు, మే 15(ఆంధ్రజ్యోతి): మన్యంలో గురువారం భారీ వర్షం కురిసింది. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ కేంద్రంలో పిడుగుపడి 9 మేకలు మృతి చెందాయి. కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి, ముంచంగిపుట్టులో కుండపోత వాన కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. పాడేరులో 34.3, కొయ్యూరులో 33.0, అనంతగిరిలో 32.9, జి.మాడుగులలో 32.0, డుంబ్రిగుడలో 31.2, అరకులోయ, హుకుంపేటలో 30.1, పెదబయలులో 29.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చింతపల్లిలో...
చింతపల్లి: మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో అధిక వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది. వర్షం వల్ల లంబసింగి వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు అవస్థలు పడ్డారు.
కొయ్యూరులో..
కొయ్యూరు: మండల వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండ కాసి ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమై సుమారు గంట సేపు కురిసింది.
జీకేవీధిలో...
గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్షం కురిసింది. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. వర్షం వల్ల జీకేవీధి వారపు సంతలో వినియోగదారులు, వర్తకులు ఇబ్బంది పడ్డారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల: మండలంలో గురువారం వర్షం కురిసింది. జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు.
సీలేరు, ధారకొండల్లో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు, ధారకొండ, దుప్పులవాడ, గుమ్మిరేవుల పంచాయతీల పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం 11 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో వాన కురిసింది. రహదారులపై వర్షపు నీరు ప్రవహించింది.
హుకుంపేటలో...
హుకుంపేట: మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. రంగశీల పంచాయతీ కేంద్రంలో పిడుగుపడి 9 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతులు గొల్లోరి, అర్జున్, సమరెడ్డి ధర్మ, సమరెడ్డి గాసన్నల మేకలు మృతి చెందడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానిక ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహించింది. వాగులు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో కళకళలాడుతున్నాయి.