యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:55 PM
యోగాంధ్ర ద్వారా ఆరోగ్యాంధ్రాగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా యోగా సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ పిలుపునిచ్చారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్
25 వేల మంది విద్యార్థులతో
గిన్నిస్ రికార్డు సాధనకు కసరత్తు
పాడేరు జూన్ 6 (ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర ద్వారా ఆరోగ్యాంధ్రాగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా యోగా సాధనలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో యువతను ఆకట్టుకొని యోగా సాధన చేయించాలన్నారు. ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని, ఆ రోజు నుంచే విద్యార్థులకు ప్రతి రోజూ 40 నిమిషాలు యోగా సాధన చేయించాలని సూచించారు. ఇటీవల అరకులో 21,800 మందితో 108 సూర్య నమస్కారాలు చేయించి ప్రపంచ రికార్డు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈనెల 21న విశాఖలో 5 లక్షల మందితో ప్రధానమంత్రి సమక్షంలో జరగనున్న యోగా డేలో 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్బుక్ రికార్డు సాధనకు కసరత్తు చేస్తున్నామన్నారు. పాడేరు డివిజన్లో గల పాఠశాలల నుంచి ఇప్పటికే సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించిన 22 వేల మందికి అదనంగా మరో 6, 7 వేల మంది విద్యార్థులతో సాధన చేయిస్తామన్నారు. విద్యార్థుల వివరాలతో డేటా బేస్ తయారుచేసి ముందుగానే పోలీసులతో సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాలన్నారు. విశాఖ తరలించే విద్యార్థులకు ఆహారం, రెస్టు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దినేశ్కుమార్ అన్నారు. విద్యార్థుల యోగాకు ఆంధ్రా విశ్వవిద్యాలయం గ్రౌండ్ కేటాయించారని, దానికి వాటర్ ఫ్రూప్ టెంట్లు ఏర్పాటు చేయనున్నారన్నారు. యోగాంధ్రలో భాగంగా జిల్లాలో 19 మంది యోగా గురువులుగా, 112 మంది మాస్టర్ ట్రైనీలుగా, 3,367 మంది ట్రైనర్లుగా నమోదయ్యారని తెలిపారు. వారంతా 3,49,141 మందికి శిక్షణ అందించి యోగా సాధన చేయిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్.ఎంజే.అభిషేక్గౌడ, జిల్లా యోగా నోడల్ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ ఎల్.రజని, డీఎస్పీ షహబాజ్ అహమ్మద్, డీఈవో పి.బ్రహ్మాజీరావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.