13న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:31 AM
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 13న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు.
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 13న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి బీవీ రమణను ఆదేశించారు. మేయర్గా పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జూన్ ఆరున కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ తరువాత నిర్వహించకపోవడంతో పలు అంశాలపై కౌన్సిల్ నిర్ణయానికి ప్రతిపాదించాల్సి ఉంది. కమిషనర్గా కేతన్గార్గ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి సమావేశం కావడంతో అధికారులను పిలిచి కౌన్సిల్ సమావేశంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు సమాచారం సిద్ధం చేసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది.
యూసీడీలో దోపిడీపై ఆరా!
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) ఆడిట్ పేరుతో జీవీఎంసీ యూసీడీ అధికారులు, సిబ్బంది దోపిడీపై మెప్మా ఉన్నతాధికారులు, కమిషనర్ కేతన్గార్గ్ ఆరా తీసినట్టు తెలిసింది. మహిళా సంఘాల్లో గత ఏడాది జరిగిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు రుణాలు, పొదుపు మొత్తం తదితరాలను తెలుసుకునేందుకు మెప్మా ఎండీ తేజ్భరత్ అన్ని గ్రూపులను ఆడిట్చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు.
ఆడిట్చేసే ఏజెన్సీలకు ప్రతి గ్రూపు నుంచి రూ.300 చెల్లించాలని ఉత్తర్వులు జారీచేశారు. జీవీఎంసీ పరిధిలో కొద్దిరోజులుగా ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ ఫీజుగా రూ.300కు బదులు యూసీడీ సిబ్బంది రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు ఆరోపించారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈనెల ఒకటిన ‘యూసీడీ దోపిడీ’ శీర్షికన కథనం ప్రచురితమయింది. దీనిపై స్పందించిన మెప్మా ఎండీ, జీవీఎంసీ కమిషనర్ వేర్వేరుగా యూసీడీ పీడీకి ఫోన్చేసి ఆరా తీసినట్టు తెలిసింది. విచారణ జరిపి బాధ్యులను గుర్తించి నివేదిక పంపాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు యూసీడీ పీడీ సత్యవేణి జోన్లవారీగా విచారణ జరిపారు. కొన్నిచోట్ల అదనంగా రూ.200 వసూలుచేసినట్టు తేలిందని కొంతమంది యూసీడీ సిబ్బంది చెబుతున్నారు.
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం పదిగంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే గతంలో ఇచ్చిన అర్జీకి సంబంధించిన రశీదు తీసుకురావాలని కలెక్టర్ ఎంఎన్. హరేంధిరప్రసాద్ సూచించారు. సమస్య పరిష్కారమైతే అర్జీదారుని ఫోన్కు సమాచారం వస్తుందని, నోటీసులు, ఎండార్స్మెంట్లు వాట్సాప్ ద్వారా పంపుతున్నామని అన్నారు. సమస్య పరిష్కారం స్టేటస్ కోసం అర్జీదారులు 1100 నంబరుకు ఫోన్చేసి తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
దేవరాపల్లిలో వైసీపీ జడ్పీటీసీ సభ్యుల సమావేశం రేపు
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ జడ్పీటీసీ సభ్యుల సమావేశం ఈ నెల ఐదో తేదీన దేవరాపల్లి మండలం మామిడిపల్లిలో జరగనున్నది. వైసీపీ జడ్పీటీసీ సభ్యుల ఫోరం అధ్యక్షుడు కర్రి సత్యం (దేవరాపల్లి సభ్యుడు) అధ్యక్షతన సమావేశంకానున్నారు. గ్రామ దేవత పండుగతోపాటు ఫోరం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయన ఉమ్మడి జిల్లాలో వైసీపీ జడ్పీటీసీ సభ్యులకు ఆహ్వానం పంపారు. అయితే జడ్పీ చైర్పర్సన్కు, వైసీపీ జడ్పీటీసీ సభ్యులకు మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించడం పలు ఊహాగానాలకు తావిస్తున్నది.