మహా పక్షపాతం
ABN , Publish Date - Apr 18 , 2025 | 12:50 AM
జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత ఈ నాలుగేళ్లలో నలుగురు ముఖ్యుల వార్డుల్లోనే నిధులు కుమ్మరించారు.
ఆ నలుగురి వార్డులకే ఎడాపెడా నిధులు
మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైసీపీ ఫ్లోర్ లీడర్ వార్డులకు అధిక ప్రాధాన్యం
పబ్లిక్ వర్స్క్ నుంచి రూ.25 కోట్లు చొప్పున వ్యయం
మిగిలిన వార్డుల్లో ఎక్కడా రూ.3 కోట్లు దాటని వైనం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత ఈ నాలుగేళ్లలో నలుగురు ముఖ్యుల వార్డుల్లోనే నిధులు కుమ్మరించారు. మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు తమ వార్డుల్లో అవసరం లేని పనులకు కూడా నిధులను మంజూరు చేయించుకున్నారు. వారి వార్డుల్లో సగటున రూ.25 కోట్లు చొప్పున పబ్లిక్ వర్క్స్ నుంచి ఖర్చు చేశారు. అదే మిగిలిన కార్పొరేటర్ల వార్డుల్లో కనీసం రూ.మూడు కోట్లు దాటలేదు.
జీవీఎంసీ పరిధిలో 98 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలి. సమస్యలు ఎక్కువగా ఉన్న వార్డులకు కాస్త అదనంగా మంజూరు చేయవచ్చు. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ వార్డులను గెలుచుకోవడంతో మేయర్గా 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లుగా 52వ వార్డు కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్, 46వ వార్డు కార్పొరేటర్ కట్టమూరి సతీష్ ఎంపికయ్యారు. వైసీపీ ఫ్లోర్ లీడర్గా 44వ వార్డు కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి జీవీఎంసీలో ఈ నలుగురి హవానే నడిచింది. వారు చెప్పిందల్లా అధికారులు చేశారు. స్వపక్ష కార్పొరేటర్లు కూడా వారికి అడ్డుచెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
నగర అభివృద్ధిలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులు, ప్రత్యేక నిధులతో జరిగే పనులను పక్కనబెడితే జీవీఎంసీ నిధులతో పబ్లిక్ వర్క్స్ కింద చేపట్టే పనులను తమ వార్డులకే అధికశాతం కేటాయించుకున్నారు. మిగిలిన వార్డుల్లో కూడా రోడ్లు, డ్రైనేజీ, సామాజిక భవనాలు, పార్కులు, ఫుట్పాత్లు, కల్వర్టులు, ప్రహరీ నిర్మాణం వంటి సమస్యలు ఉన్నప్పటికీ పట్టించుకోలేదు. ఆ నలుగురు మాత్రం తమ వార్డుల్లో చిన్నపాటి సమస్య ఉన్నా నిధులను మంజూరుచేసేలా ఒత్తిడి చేసి తమ పనులు పూర్తిచేసుకున్నారు. గత నాలుగేళ్లలో పబ్లిక్ వర్క్స్ కింద ఒక్కో వార్డులో సగటున రూ.మూడు కోట్లు విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన వారి వార్డుల్లో గరిష్ఠంగా రూ.ఐదు కోట్ల విలువైన పనులు జరిగాయి. కానీ మేయర్, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్లీడర్ వార్డుల్లో మాత్రం సగటున రూ.25 కోట్లు విలువైన పనులు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో రూ.20 కోట్లు విలువైన పబ్లిక్ వర్క్స్ జరిగితే, ముడసర్లోవ రిజర్వాయర్ పరిరక్షణ పేరుతో మరో రూ.పది కోట్లతో ప్రహరీ గోడ నిర్మించారు. ఇక డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 52వ వార్డులో రూ.21 కోట్లు, మరో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ వార్డు (46)లో సుమారు రూ.23 కోట్లు, బాణాల శ్రీనివాసరావు వార్డు (44)లో సుమారు రూ.19 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. ఇవికాకుండా వీరి వార్డుల్లో గ్రీన్బెల్ట్ పరిరక్షణ, పార్కుల అభివృద్ధి పేరుతో మరో రూ.ఐదు కోట్ల వరకు ఇతర పద్దుల నుంచి ఖర్చు చేశారు.
మిగిలిన కార్పొరేటర్లు గగ్గోలు
జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగిన ప్రతిసారీ పలువురు కార్పొరేటర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ గగ్గోలు పెట్టేవారు. మేయర్, డిప్యూటీమేయర్లు, ఫ్లోర్ లీడర్తోపాటు మరికొందరి వార్డులకే భారీగా నిధులు మంజూరుచేస్తున్నారంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్పొరేటర్లతో పాటు వైసీపీ సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తంచేసేవారు. దీనిపై వివరణ ఇవ్వడానికి అధికారులు కూడా నీళ్లు నమిలేవారు. రాజకీయ స్వలాభంతో పాటు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వస్తాయనే భావనతోనే తమ తమ వార్డులకు ఎక్కువ నిధులు మంజూరు చేయించుకున్నారని కార్పొరేటర్లు విమర్శలు గుప్పించినా ఆ నలుగురు మాత్రం మౌనం వహిస్తూ వచ్చారు.