హైవేలో గ్రేడ్ సెపరేటెడ్ ఫ్లైఓవర్లు?
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:17 AM
నగరంలో జాతీయ రహదారిపై ‘గ్రేడ్ సెపరేటెడ్ ఫ్లైఓవర్లు’ వచ్చే అవకాశం ఉందని సమాచారం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే జూన్లో అది అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయానికి వెళ్లే వారంతా తప్పనిసరిగా హైవే పైనే ప్రయాణించాల్సి ఉంటుంది.
ఢిల్లీలో నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ను
కలిసిన ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా
సానుకూలంగా స్పందన
విశాఖపట్నం-భోగాపురం మధ్య
రహదారి విస్తరణకు వినతి
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
నగరంలో జాతీయ రహదారిపై ‘గ్రేడ్ సెపరేటెడ్ ఫ్లైఓవర్లు’ వచ్చే అవకాశం ఉందని సమాచారం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే జూన్లో అది అందుబాటులోకి వస్తుంది. విమానాశ్రయానికి వెళ్లే వారంతా తప్పనిసరిగా హైవే పైనే ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే గాజువాక మొదలుకొని ఆనందపురం జంక్షన్ వరకూ ప్రస్తుతం ఎక్కడికక్కడే జంక్షన్లు ట్రాఫిక్తో జామ్ అయిపోతున్నాయి. నగరంలో ఏ కార్యక్రమమైనా నిర్వహించాల్సి వచ్చినప్పుడు ట్రాఫిక్ను మళ్లిస్తే కొన్ని గంటల పాటు వాహనాలు ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తరువాత ఇదే పరిస్థితి ఎదురైతే చాలామంది వారి విమానాలను అందుకోలేని పరిస్థితి వస్తుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకునే గతంలో నగరంలో ఎనిమిది ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెట్రో రైలు ప్రాజెక్టుతో ఫ్లైఓవర్లను ముడిపెట్టి డబుల్ డెక్కర్ మోడల్లో నిర్మాణం చేపడతామని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చి, నిధులు మంజూరై నిర్మాణాలు చేపట్టి పూర్తయ్యేసరికి చాలా ఏళ్లు పడుతుంది. అంతవరకూ ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు బుధవారం ఢిల్లీలో నేషనల్ హైవే అథారిటీ చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ను కలిసి మాట్లాడారు. విశాఖపట్నం-భోగాపురం మధ్య జాతీయ రహదారి, దాని విస్తరణపై చర్చించారు. ఈ మార్గంలో రహదారిని విస్తరించడంతో పాటు గ్రేడ్ సెపరేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే నగరంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్లు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుండగా గంగవరం పోర్టు నుంచి తుంగ్లాం మీదుగా గాజువాకలో ఎన్హెచ్-16ను కలుపుతూ గతంలో ప్రతిపాదించిన ప్రాజెక్టుకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. గంగవరం పోర్టు నుంచి రోజుకు సుమారు 2,500కు పైగా భారీ వాహనాలు గాజువాక వద్ద జాతీయ రహదారిపైకి వస్తున్నాయని, ట్రాఫిక్ ఇబ్బందిగా మారడంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి గతంలో బైపాస్ రహదారిని తుంగ్లాం మీదుగా ప్రతిపాదించారని, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అది ఆగిపోయిందని చెప్పారు. రాజకీయాల కారణంగా అభివృద్ధికి ఆటంకం కలగకూడదని, తక్షణమే ఆ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపి పనులు చేపట్టాలని కోరారు. దీనికి కూడా ఆయన సానుకూలంగా స్పందించి డీపీఆర్లు పరిశీలించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.