గిరిజన సమస్యలపై సర్కారు సానుకూలత
ABN , Publish Date - May 04 , 2025 | 10:43 PM
మన్యం ప్రాంతంలోని గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలపై ఎవరైనా ఆందోళనలకు దిగితే పోలీసులను రంగంలోకి దింపి వారి గొంతు నొక్కేసేవారు.
రెండు రోజుల బంద్పై స్పందించిన ప్రభుత్వం
నేడు ప్రత్యేక డీఎస్సీ సాధన సమితి నేతలతో సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి భేటీ
లేటరైట్ మైనింగ్, 1/70 చట్టంపైనా గిరిజనులకు అనుకూల వైఖరిని కనబరిచిన ప్రభుత్వం
సర్వత్రా ఆనందం వ్యక్తం చేస్తున్న మన్యంవాసులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యం ప్రాంతంలోని గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజనుల సమస్యలపై ఎవరైనా ఆందోళనలకు దిగితే పోలీసులను రంగంలోకి దింపి వారి గొంతు నొక్కేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా గిరిజనులకు మేలు చేసేందుకే అడుగులు ముందుకు వేయడంపై మన్యంవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో గిరిజనుల కోసం స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని, షెడ్యూల్డ్ ప్రాంతంలో టీచర్ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలనే డిమాండ్పై స్పెషల్ డీఎస్సీ సాధన సమితి రెండు రోజులు బంద్ చేపడితే అధికారులు, పోలీసులు సైతం ఆందోళనకారులకు సంపూర్ణంగా సహకరించారు. అంతే కాకుండా గిరిజనులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయబోమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించడంతో పాటు ఆందోళనకారులతో చర్చలు జరపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ను ఆదేశించారు. దీంతో ఆందోళనకారులపై గత వైసీపీ పాలనలో వైఖరిని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో వైఖరిని మన్యం వాసులు బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను చెప్పుకొనే అవకాశం ఇవ్వడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని స్పందించడంపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేడు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నేతలతో మంత్రి సంధ్యారాణి భేటీ
గిరిజన స్పెషల్ డీఎస్సీ డిమాండ్పై రెండు రోజులు బంద్ చేపట్టిన స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నేతలను సోమవారం సాలూరులో మంత్రి గుమ్మడి సంధ్యారాణి భేటీకి ఆహ్వానించారు. బంద్ రెండో రోజు శనివారమే కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ ఆందోళనకారులతో కలెక్టరేట్లో చర్చలు జరపడంతో పాటు ఈ సమస్యను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.ఎం.నాయక్, ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే సోమవారం స్పెషల్ డీఎస్సీ సాధన సమితి నేతలతో మంత్రి సంధ్యారాణి స్వయంగా భేటీ కానున్నారు. దీంతో న్యాయమైన గిరిజనుల డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందనే భరోసా వచ్చిందని పలువురు భావిస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతంలోని టీచర్ పోస్టులను షెడ్యూల్డ్ ట్రైబల్స్తోనే భర్తీ చేస్తే ఎటువంటి సమస్య ఉండదని పలువురు అంటున్నారు. చర్చలకు ఆహ్వానించిన మంత్రి సంధ్యారాణి గిరిజనులకు న్యాయం చేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లైటరైట్ మైనింగ్పై కూడా...
జీకేవీధి మండలం డోకులూరు గ్రామంలోని లేటరైట్ మైనింగ్కు సంబంధించిన అంశంపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఈ నెల 3న జరగాల్సిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేసింది. అలాగే పర్యాటకాభివృద్ధి నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టాన్ని రద్దు చేస్తారనే అనుమానం కలిగేలా మాట్లాడారని గిరిజన సంఘాలు ఆందోళనలు చేపట్టి, బంద్ నిర్వహించాయి. ఆ సందర్భంలోనూ ప్రభుత్వం గిరిజనులకు సానుకూలంగా స్పందించింది. తమ ప్రభుత్వం 1/70 చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా ప్రకటించారు. గత వైసీపీ పాలనలో కనీస అభివృద్ధికి నోచని గిరిజన ప్రాంతానికి కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. దీంతో తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత సానుకూలంగా ఉందో గిరిజనులు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. అయితే ఏజెన్సీలో వార్డు సభ్యుడు మొదలుకుని పార్లమెంట్ సభ్యుడి వరకు వైసీపీకి చెందిన వాళ్లే ఉండడం, కూటమి నేతల మధ్య సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనానికి చేస్తున్న ప్రయోజన కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారని స్పష్టమవుతున్నది.