అన్నదాతకు సర్కారు సాయం
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:37 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేశాయి. జిల్లాలో 1,44,222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండో విడత లక్షా 44 వేల 222 మందికి అన్నదాత సుఖీభవ
నేడు రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు విడుదల చేశాయి. జిల్లాలో 1,44,222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమకానున్నది. మొత్తం సొమ్ము రూ.20 వేలు కాగా, తొలి విడతగా రూ.7 వేలు ఈ ఏడాది ఆగస్టులో జమ అయింది. రెండో విడత రూ.7 వేలు చొప్పున ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో బుధవారం జమ కానున్నది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 22 మండలాల్లో లక్షా 44 వేల 222 మంది గిరిజన రైతులకు రూ.7 వేలు చొప్పున మొత్తం రూ.101 కోట్ల 84 లక్షలు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం అందనుంది. జిల్లాలో అరకులోయ అసెంబ్లీ స్థానంలో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 55,357 మంది, పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 48,057 మంది, రంపచోడవరం అసెంబ్లీ స్థానం పరిధిలోని రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, వీ.ఆర్.పురం, దేవిపట్నం, గంగవరం, కూనవరం, ఎటపాక, చింతూరు, మారేడుమల్లి మండలాల్లో 40,358 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం అందనుంది.