అన్నదాతకు సర్కారు సాయం!
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:44 PM
రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి రైతుకూ రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగా తొలి విడతగా శనివారం రూ.7 వేలు చొప్పున ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది.
జిల్లాలో 1,43,089 మందికి అన్నదాత సుఖీభవ
నేడు రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రతి రైతుకూ రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగా తొలి విడతగా శనివారం రూ.7 వేలు చొప్పున ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. జిల్లాలోని పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాల్లో 1 లక్షా 43 వేల 89 మంది గిరిజన రైతులకు రూ.7 వేలు చొప్పున అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం చేయనుంది. అరకులోయ అసెంబ్లీ స్థానంలో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో 54,975 మంది, పాడేరు నియోజకవర్గంలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 48,057 మంది, రంపచోడవరం పరిధిలోని రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, వీఆర్.పురం, దేవిపట్నం, గంగవరం, కూనవరం, ఎటపాక, చింతూరు, మారేడుమల్లి మండలాల్లో 40,057 మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఆర్థిక సాయం అందనుంది.