పరవాడపాలెంలో గెడ్డవాగు కబ్జా
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:38 AM
మండలంలోని పరవాడపాలెం పంచాయతీలో కోట్లాది రూపాయల విలువ చేసే గెడ్డవాగు స్థలం కబ్జాకు గురవుతున్నది. స్థానిక సంస్థలకు చెందిన ఒక మహిళా ప్రజాప్రతినిధి భర్త దర్జాగా ఆక్రమణకు పాల్పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ కావడంతో ఆ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. దీంతో గెడ్డవాగు కబ్జా యత్నాన్ని అడ్డుకోవడానికి అధికారులు ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు.
విలువ రూ.2 కోట్లుపైనే..
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కశింకోట, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పరవాడపాలెం పంచాయతీలో కోట్లాది రూపాయల విలువ చేసే గెడ్డవాగు స్థలం కబ్జాకు గురవుతున్నది. స్థానిక సంస్థలకు చెందిన ఒక మహిళా ప్రజాప్రతినిధి భర్త దర్జాగా ఆక్రమణకు పాల్పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ కావడంతో ఆ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. దీంతో గెడ్డవాగు కబ్జా యత్నాన్ని అడ్డుకోవడానికి అధికారులు ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు.
ఉగ్గినపాలెం రెవెన్యూ పరిధిలోని పరవాడపాలెం పంచాయతీలో సర్వే నంబరు 63/9లో గెడ్డవాగు వుంది. ఇది రోడ్డుకి ఆనుకొని వుండడం, జాతీయ రహదారికి చేరువలో వుండడంతో ఇక్కడ సెంటు రూ.5 లక్షలు పలుకుతున్నది. దీంతో గెడ్డవాగుకు చెందిన 42 సెంట్ల ప్రభుత్వ స్థలంపై స్థానిక నేత కన్ను పడింది. రాజకీయంగా ‘సూపర్’గా వ్యవహరిస్తున్న ఇతను వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నేతలతో అంటకాగారు. 2022వ సంవత్సరంలో గెడ్డవాగు స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా.. స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి, స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గత ఏడాది కూటమి అధికారంలోకి రావడం, స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీ కావడతో ఇతను ఆ పార్టీ నేతగా ప్రచారం చేసుకుంటున్నారు. గెడ్డవాగు స్థలాన్ని ఆక్రమించి, దానికి ఆనుకుని వున్న తన జిరాయితీ భూమిలోకి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షలు పలుకుతున్నది. ఈ ప్రకారం గెడ్డవాగు స్థలం విలువ రూ.2 కోట్లకుపైగానే వుంటుంది. కాగా సర్వే నంబరు 63/9లో గెడ్డవాగు స్థలం కబ్జాపై తహశీల్దార్ సత్యనారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఉగ్గినపాలెం వీఆర్వోను అక్కడకు పంపించి, రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తానని చెప్పారు. అది ప్రభుత్వ భూమి అని నిర్ధారణ అయితే ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.