చీటీల పేరిట మోసం
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:49 PM
మండలంలోని చౌడువాడలో లక్షలాది రూపాయలతో చీటీల నిర్వాహకురాలు పరారైంది. దీంతో బాధితులు శుక్రవారం కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
లక్షలాది రూపాయలతో నిర్వాహకురాలు పరారీ
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కె.కోటపాడు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చౌడువాడలో లక్షలాది రూపాయలతో చీటీల నిర్వాహకురాలు పరారైంది. దీంతో బాధితులు శుక్రవారం కె.కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని చౌడువాడ శివారు గరుగుబిల్లికి చెందిన పెదిరెడ్ల పద ్మజ అలియాస్ చల్లపల్లి పద్మకు సామర్లకోటకు చెందిన శ్రీనుతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోవడంతో 15 ఏళ్ల కిందట చౌడువాడకు వచ్చి స్థిరపడింది. అప్పటి నుంచి గ్రామస్థులతో పరిచయాలు పెంచుకొని చీటీల వ్యాపారం నిర్వహిస్తోంది. గ్రామంలో పండుగలకు, ఇతర కార్యక్రమాలకు భారీగా విరాళాలు ఇస్తూ నమ్మకం పెంచుకుంది. ఒక పక్క రూ.లక్షల్లో చీటీలు నిర్వహిస్తూ మరో వైపు మహిళలను ఆకర్షించి పప్పుల చీటీలు, వరలక్ష్మి వ్రతం పేరుతో బంగారం కాసుల చీటీలను ప్రారంభించింది. క్రమంగా రూ.20 లక్షల చీటీలు కూడా వేస్తోంది. నమ్మకం కలిగిన వారు పాడిన మొత్తాన్ని కూడా వడ్డీకి తిరిగి ఆమెకే ఇచ్చేవారు. ఇలా సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి వారం రోజులు కిందట ఆరోగ్యం బాగోలేదని కుమారుడితో సహా ఇంటి నుంచి వెళ్లిన పద్మజ తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో బాధితులకు అనుమానం కలిగింది. అంతకు ముందు బ్యాంకులో కుదువ పెట్టిన రూ.12 లక్షల విలువైన బంగారం ఆభరణాలు పరారయ్యే ముందు విడిపించుకుని పట్టుకుపోయినట్టు బాధితులు చెబుతున్నారు. ఆమెకు సన్నిహితంగా ఉండే చౌడువాడకు చెందిన ఒక వ్యక్తికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది బాధితులు లబోదిబోమంటూ సర్పంచ్ దాడి ఎరుకునాయుడును వెంట బెట్టుకుని కె.కోటపాడు ఎస్ఐ ధనుంజయను కలిసి ఫిర్యాదు చేశారు.