చంద్రంపాలెం వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి
ABN , Publish Date - May 15 , 2025 | 12:59 AM
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) జోన్-2 ఆరో వార్డు పరిధి లోని చంద్రపాలెం ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై రూ.3.23 కోట్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పరిపాలన ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
నిర్మాణ వ్యయం రూ.3.23 కోట్లు
ఆనందం వ్యక్తం చేస్తున్న మధురవాడ పరిసర ప్రాంతాల ప్రజలు
విశాఖపట్నం/కొమ్మాది, మే 14 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) జోన్-2 ఆరో వార్డు పరిధి లోని చంద్రపాలెం ఉన్నత పాఠశాల వద్ద జాతీయ రహదారిపై రూ.3.23 కోట్లతో ఫుట్ఓవర్ బ్రిడ్జి (ఎఫ్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రపాలెం ఉన్నత పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితోపాటు మధురవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారంతా చంద్రంపాలెం వద్ద జాతీయ రహదారిని దాటుకుని ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటారు. దీనివల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రంపాలెం ఉన్నత పాఠశాల వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి ప్రజాప్రతినిధులు ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి హడావుడిగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిపాలన ఆమోదం రాకపోవడంతో ఆ పనులు చేపట్టకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రంపాలెంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఎఫ్వోబీ అవసరం ఎంతైనా ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.3.23 కోట్లతో పనులను ప్రారంభించేందుకు పరిపాలన ఆమోదం తెలిపింది. దీంతో చంద్రంపాలెం పాఠశాల వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కల త్వరలో నెరవేరబోతుందని మధురవాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.