ఎట్టకేలకు యాత్రీనివాస్కు మోక్షం
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:26 AM
విశాఖపట్నంలో పర్యాటకులకు ఆ శాఖ తరపున ఒక గది కూడా లేకుండా చేసిన పాపాన్ని వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ లోపాన్ని కేబినెట్లో బుధవారం సరిచేసింది. పర్యాటక శాఖకు రుషికొండపై హరిత రిసార్ట్స్, ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద యాత్రీనివాస్ ఉండేవి. రుషికొండపై రిసార్ట్స్ను కూలగొట్టి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రూ.450 కోట్లతో రాజభవనం నిర్మించుకున్నారు. నిర్మాణం జరిగినంత కాలం అది పర్యాటకుల కోసమేనంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. పూర్తయ్యాక సీఎం నివాసం అన్నారు.
అదనపు ఖర్చుకు కేబినెట్ ఆమోదం
త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం
విశాఖపట్నం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో పర్యాటకులకు ఆ శాఖ తరపున ఒక గది కూడా లేకుండా చేసిన పాపాన్ని వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ఆ లోపాన్ని కేబినెట్లో బుధవారం సరిచేసింది. పర్యాటక శాఖకు రుషికొండపై హరిత రిసార్ట్స్, ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద యాత్రీనివాస్ ఉండేవి. రుషికొండపై రిసార్ట్స్ను కూలగొట్టి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రూ.450 కోట్లతో రాజభవనం నిర్మించుకున్నారు. నిర్మాణం జరిగినంత కాలం అది పర్యాటకుల కోసమేనంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. పూర్తయ్యాక సీఎం నివాసం అన్నారు. దాంతో పర్యాటకులకు రుషికొండపై ఉండడానికి అవకాశం కొరవడింది. ఇక ఎంవీపీ కాలనీలోని యాత్రీనివాస్ను రూ.8 కోట్లతో ఆధునికీకరించడానికి ఆ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది. పనులు చేపట్టిన తరువాత అంచనా వ్యయం పెరిగింది. అదనంగా మరో రూ.5.5 కోట్లు అవసరమని నాటి ఈఈ రమణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అంత మొత్తం అయితే కొత్త భవనమే నిర్మించుకోవచ్చు కదా?...అంటూ ఉన్నతాధికారులు ఫైల్ పక్కన పెట్టేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక దానిపై అనేకసార్లు సమీక్షించింది. చివరికి అదనపు సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మాత్రమే ఉపయోగించాలనే నిబంధనతో నిధులు ఇవ్వడానికి బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అవన్నీ పూర్తిచేసి త్వరలో యాత్రీనివాస్ను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.