ఘాట్లో తుప్పలతో తిప్పలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:20 PM
పాడేరు ఘాట్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా తుప్పలు పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్లో మలుపు మార్గం కనిపించక నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.
మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు
బెంబేలెత్తుతున్న వాహనచోదకులు
కొన్నేళ్లుగా జరగని జంగిల్ క్లియరెన్స్
హెచ్చరిక బోర్డులు సైతం కనిపించని దుస్థితి
పట్టించుకోని రోడ్లు, భవనాల శాఖ అధికారులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు ఘాట్ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా తుప్పలు పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు, డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్లో మలుపు మార్గం కనిపించక నిత్యం వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఘాట్లో రోడ్డుకు ఇరువైపులా దట్టంగా తుప్పలు పెరగడంతో ఎదురుపడే వాహనాలకు దారి ఇవ్వడం ఒక సమస్య అయితే, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం మరో సమస్యగా ఉంది. దీంతో ఘాట్లో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం ఘాట్లో ఇరువైపులా ఉన్న తుప్పల కారణంగా డ్రైవర్లు వాహనాల రాకపోకలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని పలువురు డ్రైవర్లు అంటున్నారు. ఈ విధంగా రోజుకు కనీసం రెండు వాహనాలు ఘాట్లో ప్రమాదాలకు గురవుతున్నాయని వారంటున్నారు.
ఘాట్లో పెరుగుతున్న వాహనాల రాకపోకలు
పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ఘాట్ ప్రయాణం తప్పనిసరి. పాడేరు మండలం మినుములూరు నుంచి వి.మాడుగుల మండలం గరికబంద వరకు 26 కిలోమీటర్లు ఘాట్ మార్గమే. ఏజెన్సీలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ మండలాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. అలాగే పాడేరు జిల్లా కేంద్రం కావడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు వాహనాల రాకపోకలు మరింతగా పెరిగాయి. దీంతో స్థానిక ఘాట్ మార్గం నిత్యం వాహనాలతో రద్దీగా ఉండడంతో పాటు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2023 ఆగస్టు 20న వ్యూపాయింట్కు సమీపంలోని ఓ మలుపు వద్ద చెట్టు కొమ్మను ఆర్టీసీ బస్సు ఢీకొని లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 26 మంది గాయాల పాలైన ప్రమాదాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు.
చాలా ఏళ్లుగా జరగని జంగిల్ క్లియరెన్స్
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఘాట్ మార్గంలో తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఘాట్ మార్గాల్లో ప్రతి ఏడాది విధిగా జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఎటువంటి జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడంతో ఘాట్ మొత్తం తుప్పలే కనిపిస్తున్నాయి. ఘాట్లోని రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని దుస్థితి కొనసాగుతున్నది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా రెండేసి అడుగుల చొప్పున అంచులు ఉంటాయి. కానీ ఆ అంచులన్నీ తుప్పలతో కప్పేశాయి. అలాగే ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా తుప్పలు మొలిచిపోవడంతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు, భవనాల శాఖాధికారులు స్పందించి ఘాట్ మార్గంలో ప్రమాదకరంగా ఉన్న తుప్పలను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు, పర్యాటకులు కోరుతున్నారు.