విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి
ABN , Publish Date - May 06 , 2025 | 11:23 PM
మండలంలోని నర్సింగబిల్లిలో వ్యవసాయ బోరు వద్ద విద్యుత్ షాక్కు గురై మహిళా రైతు మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి.
కశింకోట, మే 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నర్సింగబిల్లిలో వ్యవసాయ బోరు వద్ద విద్యుత్ షాక్కు గురై మహిళా రైతు మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి. గ్రామానికి చెందిన చవితిన చెల్లయ్యమ్మ (54) మంగళవారం ఉదయం కుమారుడు రమణబాబుతో కలిసి పొలంలో నువ్వులు చల్లడానికి వెళ్లారు. ఇంటి వద్ద నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న మంచినీరు అయిపోవడంతో నీటి కోసం ఆమె వ్యవసాయ విద్యుత్ బోరు వద్దకు వెళ్లింది. స్విచ్ ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై గిలగిటకొట్టుకుంటున్నది. సమీపంలో వున్న కుమారుడు వెంటనే కర్ర తీసుకుని విద్యుత్ బోర్డును నేల కూల్చి, తల్లిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీకి తరలించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.