ఫేసియల్ పరేషాన్!
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:44 AM
ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా రేషన్ సరుకులు తీసుకునే గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ గుర్తింపు హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు బాల సంజీవిని కిట్టు, 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తారు. బాల సంజీవిని, టీహెచ్ఆర్ తీసుకునే లబ్ధిదారులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవిని యాప్, కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్లు సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అంగన్వాడీ కేంద్రాలలో ఆయా యాప్ల ద్వారా ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)లో ముఖ గుర్తింపు నమోదు చేసుకోవాలి. గత ఏడు నెలలుగా ముఖ గుర్తింపు నమోదు కాకపోయినా లబ్ధిదారులకు మాన్యువల్గా రేషన్ సరుకులు ఇచ్చేవారు. అయితే ఈ నెలలో ముఖ గుర్తింపు నమోదుకాని లబ్ధిదారులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోనున్నది.
- ముఖ గుర్తింపునకు సాంకేతిక సమస్యలు
- జిల్లాలో 1,908 అంగన్వాడీ కేంద్రాలు
- గర్భిణులు, బాలింతలు, మూడేళ్లలోపు పిల్లలు కలిపి 53,022 మంది
- సాంకేతిక సమస్యతో నమోదుకానివారు 2,625 మంది
- వీరందరికీ వచ్చే నెలలో రేషన్ సరుకులు నిలిపివేసే అవకాశం
నర్సీపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా రేషన్ సరుకులు తీసుకునే గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు ముఖ గుర్తింపు హాజరును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు బాల సంజీవిని కిట్టు, 3 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేస్తారు. బాల సంజీవిని, టీహెచ్ఆర్ తీసుకునే లబ్ధిదారులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవిని యాప్, కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్లు సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అంగన్వాడీ కేంద్రాలలో ఆయా యాప్ల ద్వారా ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టం(ఎఫ్ఆర్ఎస్)లో ముఖ గుర్తింపు నమోదు చేసుకోవాలి. గత ఏడు నెలలుగా ముఖ గుర్తింపు నమోదు కాకపోయినా లబ్ధిదారులకు మాన్యువల్గా రేషన్ సరుకులు ఇచ్చేవారు. అయితే ఈ నెలలో ముఖ గుర్తింపు నమోదుకాని లబ్ధిదారులకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోనున్నది.
జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1908 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. బాలింతలు, గర్భిణులు, 7 నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలు మొత్తం 53,022 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 50,397 మందికి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)లో నమోదు పూర్తి చేశారు. ఇంకా 2,625 మంది మిగిలిపోయారు. ఇప్పటి వరకు ఎఫ్ఆర్ఎస్లో నమోదుకాని లబ్ధిదారులకు కూడా అంగన్వాడీ కేంద్రాలలో మాన్యువల్గా రేషన్ సరుకులు ఇచ్చేవారు. అయితే వచ్చే నెల నుంచి మాత్రం వీరిని అనర్హులుగా తేల్చి సరుకుల సరఫరా నిలిపివేయనున్నారు.
సర్వర్లు పని చేయక చిక్కులు
పోషణ ట్రాకర్ యాప్లో లబ్ధిదారుల ఫొటో తీసేటప్పుడు ఆధార్లో ఫొటో మ్యాచ్ కాకపోతే తిరస్కరిస్తుంది. దీనికి తోడు సర్వర్ సమస్య కారణంగా లబ్ధిదారులు వచ్చినప్పుడు యాప్లు పని చేయడం లేదు. ఉదయం 10 గంటలలోపు సర్వర్లు పని చేస్తున్నాయి. తరువాత ఎంత ప్రయత్నం చేసినా పని చేయడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు అంటున్నారు.
ఎఫ్ఆర్ఎస్లో నమోదుకాని లబ్ధిదారులు
- నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 4,430 మంది లబ్ధిదారులు ఉండగా, 4,366 మంది ఎఫ్ఆర్ఎస్లో నమోదయ్యారు. ఇంకా 64 మంది నమోదు కావలసి ఉంది.
- అనకాపల్లి ప్రాజెక్టు పరిధిలో 7,992 లబ్ధిదారులకు గాను 7,828 మందికి ముఖ గుర్తింపు పూర్తయింది. ఇంకా 164 మంది మిగిలిపోయారు.
- గొలుగొండ ప్రాజెక్టు పరిధిలో 3,645 మందికి గాను 3,579 మంది ఎఫ్ఆర్ఎస్లో నమోదయ్యారు. ఇంకా 66 మంది మిగిలిపోయారు.
- కె.కోటపాడు ప్రాజెక్టు పరిధిలో 2,802 మంది లబ్ధిదారులకు గాను 2,751 మంది ఎఫ్ఆర్ఎస్లో నమోదయ్యారు. ఇంకా 51 మంది మిగిలిపోయారు.
- నక్కపల్లి ప్రాజెక్టు పరిధిలో 9,284 మంది లబ్ధిదారులకు గాను 8,437 మంది నమోదయ్యారు. ఇంకా 847 మంది మిగిలిపోయారు.
- రావికమతం ప్రాజెక్టు పరిధిలో 7,919 మంది లబ్ధిదారులకు గాను 7,709 మంది నమోదయ్యారు. ఇంకా 210 మంది మిగిలిపోయారు.
- సబ్బవరం ప్రాజెక్టు పరిధిలో 5,273 మంది లబ్ధిదారులకు గాను 5,101 మందికి ఎఫ్ఆర్ఎస్లో నమోదయ్యారు. ఇంకా 172 మంది నమోదు కావలసి ఉంది.
- వి.మాడుగుల ప్రాజెక్టు పరిధిలో 3,240 మంది లబ్ధిదారులకు గాను 2,971 మందికి పూర్తి చేశారు. ఇంకా 269 మంది మిగిలిపోయారు.
- ఎలమంచలి ప్రాజెక్టు పరిధిలో 8,437 మంది లబ్ధిదారులకు గాను 7,655 మంది ఎఫ్ఆర్ఎస్లో నమోదయ్యారు. ఇంకా 782 మంది మిగిలిపోయారు.